వెంగళరావునగర్, అక్టోబర్ 27 : ఇల్లు కబ్జా చేసి.. ఆపై గంజాయి దందా చేస్తున్న రౌడీషీటర్ను మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ ప్రధాన రహదారిలోని ఇండియన్ బ్యాంకు ఎదుట ఉన్న ఓ ఫ్లాట్ యజమాని రాజేశ్వర్ గుప్తా.. ఆ ఫ్లాట్ను కార్తిక్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. ఇల్లు ఖాళీ చేస్తున్నట్లు 15 రోజుల కిందట కార్తిక్ ఇంటి యజమానికి చెప్పాడు. ఇటీవల ఇంటి యజమాని రాజేశ్వర్గుప్తా కుమారుడు శ్రీనాథ్ గుప్తా వచ్చి ఫ్లాట్ను చూడగా.. అద్దెకు ఇచ్చిన వ్యక్తి కాకుండా గువ్వల పవన్కుమార్ అలియాస్ బిల్లా పవన్ అనే రౌడీషీటర్ కనిపించాడు.
ధూల్పేట నుంచి గంజాయి తీసుకొచ్చి.. అక్కడి వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. ఇల్లు ఖాళీ చేయనని.. ఇల్లు ఖాళీ చేయాలంటే తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. తనతో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా దాడి చేశారు. నిందితుడు పవన్కుమార్ నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. అతడిపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.