హైదరాబాద్: మాదాపూర్ కాల్పుల ఘటనకు రియల్ఎస్టేట్ వ్యవహారమే కారణమని బాలానగర్ డీసీపీ సందీప్ రావు చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్పై జిలానీ నాటుతుపాకీతో కాల్పులు జరిపాడని వెల్లడించారు. మాదాపూర్ కాల్పుల ఘటనపై డీసీపీ సందీప్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇస్మాయిల్, ముజాహిద్దీన్ మధ్య భూవివాదం ఉందని చెప్పారు. ‘మాదాపూర్ పీఎస్ పరిధిలోని నీరూస్ జంక్షన్ వద్ద ఇద్దరు భూ విషయం మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో ముజాహిద్దీన్ వెంట వచ్చిన జిలానీ నాటు తుపాకీతో ఇస్మాయిల్పై కాల్పులు జరిపాడు.
సంగారెడ్డిలో ఇస్మాయిల్, ముజాహిద్దీన్ కలిసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. జహీరాబాద్లో భూ లావాదేవీలు గొడవకు దారితీశాయి. జిలానీపై గతంలో కేసులు ఉన్నాయి. ఇస్మాయిల్ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. కాల్పుల్లో జహంగీర్కు గాయాలయ్యాయి. అతడు చికిత్స పొందుతున్నాడు’ అని పేర్కొన్నారు.