సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఆకాశంలో జరుగుతున్న అద్భుతాన్ని వీక్షించే ఘడియలు రానేవచ్చాయి. మంగళవారం చంద్రగ్రహణం కావడంతో ఆకాశంలో కనువిందు చేయనున్న బ్లడ్మూన్ను వీక్షించడానికి నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు బ్లడ్మూన్ దశ ప్రారంభం అవుతుండగా హైదరాబాద్లో మాత్రం దీనిని సాయంత్రం 6గంటల తర్వాత చూసే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు ఎరుపు రంగులో కనిపించడాన్ని బ్లడ్మూన్ అని పిలుస్తారు. అయితే ఈ బ్లడ్ మూన్ను ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో వీక్షించనున్నారు. దేశంలోని చాలా నగరాల్లో 7 నుంచి 25 నిమిషాలు వీక్షించే అవకాశం ఉంది. బిర్లా ప్లాంటోరియం, ఓయూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చంద్రగ్రహణ వీక్షణ ఏర్పాట్లు చేశారు. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028, జూలై 6న ఏర్పడే అవకాశం ఉంది.