సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): గంజాయి, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ, కొకైన్ వంటి మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. ఇటీవల గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగం జరిగిన ఘటనతో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి.. మత్తు పదార్థాలను నిరోధించే క్రమంలో ఎస్ఓటీ బృందాలను రంగంలోకి దింపారు. దీంతో కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటీ బృందాలు వరుస దాడులు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే రెండు రోజులుగా కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో ఐదుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 4.4 కిలోల గంజాయి, 5ఎస్ఎస్డీ బ్లాస్టులను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా ప్రాంతానికి చెందిన గగన్ కుమార్ బెహరా మాదాపూర్ ఎస్బీఐ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కత్లాపూర్ సిగ్నల్ వద్ద గంజాయి విక్రయిస్తుండగా.. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 1.9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఒడిశాకు చెందిన కుషాల్ ప్రదాన్, మిథున ధాయ్ కలిసి మాదాపూర్ సిద్ధిక్నగర్లో గంజాయి విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు వారిని పట్టుకుని, వారి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
కాగా, నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద ఎల్ఎస్డీ డ్రగ్ పేపర్లతో వెళ్తున్న లా విద్యార్థి కుమ్మరి విశాల్ సాయిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని, అతడి వద్ద నుంచి 5ఎల్ఎస్డీ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రగనగర్ ఎంఎం పహాడ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షకీల్ అత్తాపూర్ రోడ్డులో ఆటోలో పెట్టుకుని గంజాయి విక్రయిస్తుండగా.. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 210 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి, తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత పోలీసు స్టేషన్లలో అప్పగించారు.