హైదరాబాద్ : ఓ యువకుడు తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ యువతికి మరొకరితో వివాహం నిశ్చయించారు.. పెళ్లి కూడా చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు.. ప్రియురాలికి వివాహం జరుగుతున్న ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన లంగర్హౌజ్ మొగల్ ఫంక్షన్ హాల్ వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్కు చెందిన షేక్ ఆశ్వక్(19), స్థానికంగా ఉన్న ఫాతిమా(19)ను గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ విషయం ఇంట్లో తెలియడంతో ఫాతిమాకు మరొకరితో పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో నిన్న ఫాతిమాకు లంగర్హౌస్లోని మొగల్ ఫంక్షన్ హాల్లో మరో వ్యక్తితో పెళ్లి చేశారు. ఈ విషయం ఆశ్వక్కు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లిన ఆ ప్రేమికుడు.. కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పి, అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.