రంగారెడ్డి జిల్లా కోర్టులు, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): బాలికకు మాయమాటలు చెప్పి.. ప్రేమలో పడేసి…బెంగళూరుకు తీసుకెళ్లిన నిందితుడికి రెండేండ్ల జైలు, రెండు వేల జరిమానా విధిస్తూ.. రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో న్యాయస్థానం తీర్పునిచ్చింది. అల్వాల్ చెందిన నిశాంత్ కుమార్ చౌదరికి అదే ప్రాంతంలో నివాసముండే బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు. ఇది గమనించిన బాలిక తల్లి నిందితుడిని హెచ్చరించింది. అయినా నిశాంత్ తన తీరు మార్చుకోకుండా బాలికను పదిరోజుల పాటు బెంగళూరు, ముంబైకి తీసుకుపోయాడు. బాధితురాలి తల్లి అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని నిందితుడికి రిమాండ్ విధించి, దర్యాప్తు చేపట్టారు. కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. నిశాంత్కుమార్కు శిక్ష విధించింది.