శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 21 : షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టాలు రావడంతో.. ఓ యువకుడు యూట్యూబ్లో వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతూ గురువారం శంషాబాద్ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి వివరాలను వెల్లడించారు. అత్తాపూర్ పాండురంగానగర్ కాలనీకి చెందిన వెంకటరమణ యాదవ్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. ఆ తర్వాత డబ్బు సంపాదించేందుకు అడ్డుదారులు వెతికాడు.
యూ ట్యూబ్ వీడియోల ద్వారా గొలుసు దొంగతనాలు చేసే తీరును తెలుసుకున్నాడు. దీంతో నేరాలు చేయడం మొదలు పెట్టాడు. కొత్తూరు, నందిగామ, మోకిల, నార్సింగి పోలీసు స్టేషన్ల పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడ్డాడు. నందిగామ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన గొలుసు దొంగతనం కేసులో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి నిఘా పెట్టారు. గురువారం కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని అయప్పస్వామి దేవాలయం సమీపంలో అనుమానాస్పదస్థితిలో నిందితుడు కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి 12 తులాల బంగారం, ద్విచక్రవాహనం, స్మార్ట్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.