37 ఏండ్లుగా కొనసాగుతున్న ఆచారం
సైదాబాద్, ఏప్రిల్ 9: సైదాబాద్ డివిజన్ పరిధిలోని ఏపీఏయూ కాలనీలోని నివసించే సూర్యనారాయణ రాజు కుటుంబం తమ ఇంట్లోనే ధర్మనిలయం పేరిట రామాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో 37 ఏండ్లుగా మరమరాలతో పందిరి వేసి భదాద్రి రాముడి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. ఎనిమిదేండ్ల క్రితం సూర్యనారాయణ రాజు మరణించటంతో ఆయన సతీమణి అనసూయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి అనవాయితీగా వస్తున్న కల్యాణోత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా రామకోటి జపం, విష్ణుసహస్రనామాలు, నగర సంకీర్తన, భజనలు, హోమాలు, నిత్యాన్నదానం వంటి అనేక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన రామ భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఆదివారం జరిగే రాములోరి కల్యాణోత్సవ పనుల్లో స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నారు.
రెండు బస్తాల మరమరాలు, వేరుశెనగలు..
భద్రాద్రి రాముడి కల్యాణోత్సవ పెండ్లి పందిరి అలకరణకు 60 కేజీల మరమరాలు, 40 కేజీల వేరుశెనగలను వినియోగిస్తున్నారు. మాఘశుద్ధ పంచమి రోజున గ్రామదేవతలకు చలిమిడి, పాలతో అభిషేకించి పందిరి అలంకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఉగాది రోజున పందిరి అలంకరణ పనులు మొదలు కావటంతో సుమారు 40 మంది మహిళా భక్తులు దారాలకు మరమరాలను, వేరుశెనగలను ఎక్కించి దండలను అలకంరించారు. పందిరిలో రామాయణ ముఖ్య ఘట్టాలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు.
రాముడి ఆదేశంతోనే సేవ..
నేను చిన్నప్పటి నుంచి రాముడి భక్తురాలిని. ఆ రాముడి ఆదేశంతోనే ఈ సేవ చేస్తున్నాను. మరమరాలతో ముత్యాల పందిరి అలంకరణను ఉగాది రోజున మొదలు పెట్టి నవమి వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. భగవద్గీత, రామాయణ పారాయణం చేస్తూనే భక్తులు మరమరాల హారాలు అల్లుతారు. 37 ఏండ్లుగా మరమరాల పందిరిలో సీతారామ కల్యాణం జరిపిస్తున్నాం. – అనసూయమ్మ