వాళ్లంతా అపర కుబేరులు కాదు. లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాల్లో లేరు. పెద్ద పెద్ద కంపెనీల తోడ్పాటు అంతకన్నా లేదు. అయితేనేం పరులకు సేవ చేయడానికి ఆస్థులు, అంతస్తులు అక్కర్లేదని స్పందించే గుణం ఉంటే చాలు అని నిరూపిస్తున్నారు. సొంత లాభం కొంత మానుకొని సేవలు చేస్తూ.. ప్రేమను పంచుతూ తోటి వారికి ఎలా సాయపడవచ్చో చేసి చూపిస్తున్నారు.
సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): మానవసేవే మాధవ సేవ అన్నారు. పెద్దలు ‘సేవతోనే నిజమైన సంతృప్తి’ ఈ థీమ్తో సామాజిక సంస్థలు విభిన్న రకాల సేవలందిస్తున్నాయి. కొందరు వారి నెల జీతాల్లో కొంత వెచ్చించి సామాజిక సేవ చేస్తే.. ఇంకొందరు సేవా సంస్థలు స్థాపించి అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. తమ పనులు చేసుకుంటూనే వీలైతే కొంత సమయమైనా.. సామాజిక సేవ చేయడానికి వెచ్చిస్తున్నారు మరికొందరు. అందులో లాడ్జ్కీస్ సంస్థలోని 297 మంది సభ్యులు వినూత్నంగా ఇండ్లల్లోని వేడుకలను రద్దు చేసుకుని సామాజిక సేవలు అందిస్తున్నారు. తమ చుట్టూ ఉండే మనుషుల బాగోగులు పట్టించుకోవడం కోసం తలా కొంత డబ్బులు జమ చేసి సేవలు అందిస్తున్నారు. జీహెచ్ఎంసీ అన్నదాన కేంద్రాల వద్ద డబ్బులు చెల్లించి సుమారు వంద మంది ఆకలిని ఈ సంస్థ తీర్చింది.
చలికాలంలో రోడ్లపై నిద్రించే వారికి స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. కొబ్బరి బోండాల కొట్టు వద్ద వంద బోండాలకు సంబంధించిన డబ్బులు చెల్లించి.. ఎవరైనా యాచకులు కనిపిస్తే వారికి ఉచితంగా బోండాలు ఇవ్వాలి అని చెప్పి వెళ్లిపోతారు. వారి సేవలు తెలిసిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఆ సంస్థ సభ్యుడు ఒకరు వివాహమై 25 ఏండ్లు గడిచిన సందర్భంగా ఈవెంట్ చేసుకోకుండా ఆ డబ్బులను సామాజిక సేవకు ఉపయోగించారు. 25 ఏండ్ల వివాహానికి గుర్తుగా 25 సేవా కార్యక్రమాలు చేపట్టాలని భావించారు. అందులో భాగంగానే ఓ విద్యార్థి కాలేజీ ఫీజు చెల్లించారు. ఆలయానికి ఆర్థిక సాయం చేశారు. వంద మంది అనాథ పిల్లలతో లంచ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు. ఇలా 25 సేవా కార్యక్రమాలు ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని లాడ్జ్కీస్ సభ్యులు తెలిపారు.
నిరుపేద చిన్నారుల చదువుకు చేయూత..
ఫ్యాషన్ యాత్ర పేరుతో ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ కామిని షరఫ్ దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై, లక్నో తదితర ప్రధాన నగరాలన్నింటిలో ఫ్యాషన్ యాత్ర నిర్వహించారు. ఈ ఫ్యాషన్ యాత్రలో విభిన్న రకాల దుస్తులు, జువెల్లరీ, గార్మెంట్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన బ్రాండ్ను మార్కెటింగ్ చేస్తారు. అయితే ఈ ఈవెంట్స్ ద్వారా వచ్చే ఆదాయం నిరుపేద విద్యార్థుల చదువు కోసం ఉపయోగించడం విశేషం. టీచ్ ఫర్ ఛేంజ్ అనే ఎన్జీఓ సంస్థకు సహాయం చేసి చదువు మధ్యలో ఆపేసిన చిన్నారులకు అండగా నిలుస్తున్నారు.
ఆర్భాటాలు తగ్గించుకోవాలి
నిజమైన సంతోషం సేవలోనే ఉంది. మన ఖర్చులు, వేడుకల ఆర్భాటాలు కొంత తగ్గించుకుంటే నిరుపేదల కష్టాలను కొంతైనా తీర్చగలుగుతాం. మేం ఈ విషయాన్ని అందరికి తెలియజేస్తున్నాం. మనచుట్టూ ఉన్న మనుషుల కష్టాలను పట్టించుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది.
– కామిని షరఫ్, ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్
సమాజం కోసం ఆలోచిద్దాం
మనవంతు బాధ్యతగా సమాజం కోసం పని చేయాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. మేం ఇటీవల అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నాం. దేశంలో అంధుల సంఖ్య అధికంగా ఉంది. వారికి తిరిగి చూపు ప్రసాదించే అవకాశం మన చేతుల్లో ఉంది. మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారి అవయవాలు ఇతరులకు దానం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది.
– మధు, లాడ్జ్కీస్ సభ్యుడు