ప్రతాప్ ఓ రెస్టారెంట్ యజమాని. వ్యాపార పనులు ముగించుకుని ఇంటికి చేరే సరికి రోజు మారిపోయేది. అర్ధరాత్రి భోజనం చేస్తుంటుంటే నిన్నటి అన్నం తింటున్నావని ఇంట్లో వారు జోకులేసేవారు. ఇక నిద్రపోదామని బెడ్ ఎక్కితే ఉదయం నాలుగు గంటలైనా రాకపోయేది. ఫలితంగా బీపీ, షుగర్ వచ్చాయి. వైద్యులు సరైన సమయానికి నిద్రపోవడంతో పాటు, ఆహారం తీసుకోవాలని సూచించినా వీలు కాక పోయేది. ప్రస్తుతం లాక్డౌన్ విధించడంతో అతడి లైఫ్ స్టయిల్ మారింది. కావాల్సినంత సమయం దొరకడంతో బీపీ, షుగర్ కంట్రోల్లోకి వచ్చాయి.
నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్ యజమాని రాధిక కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతుండగా సరైన నిద్ర, మంచి ఆహారం తీసుకుంటే నయం అవుతుందని వైద్యులు సూచించారు. కానీ వ్యాపార రీత్యా అది కుదరకపోయేది. నిత్యం పని ఒత్తిడితో నిద్రించే సరికి రా త్రి ఒంటిగంట దాటేది. అయితే లాక్డౌన్ ఆమె జీవనాన్ని మార్చేసింది. కావాల్సినంత సమయం దొరుకుతుండటంతో వైద్యుల సూచనలు పాటిస్తూ మధుమేహాన్ని అదుపులో పెట్టుకుంటున్నది.
లాక్డౌన్ వల్ల దొరికిన కాసింత వ్యవధిలో నగరవాసులు కొందరు తమ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. రోజువారీ ఉరుకుల పరుగులతో తమను తాము పట్టించుకునే తీరిక దొరక్కపోవడంతో చాలామందికి కొన్ని శారీరక వ్యాధులు, మానసిక అశాంతి చుట్టుముట్టాయి. వీటన్నింటినీ పరిశీలించి సమీక్షించుకొని వైద్యుల సలహా మేరకు మందులు వాడి విశ్రాంతి తీసుకునే వెసులుబాటు దొరికింది. దీంతో తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు లాక్డౌన్ ఓ మంచి అవకాశంలా మారిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
సహజంగా అత్యధిక శాతం నగరవాసులు కాస్త పొద్దుపోయాకే నిద్ర లేస్తారు. ఉద్యోగం, వ్యాపారం..అన్నీ నగరంలో బాగా పొద్దుపోయేవరకు నడుస్తాయి. ఏ అర్ధరాత్రి తర్వాతో నిద్రకు ఉపక్రమించాల్సిన పరిస్థితి. అటువంటిది లాక్డౌన్ విధించాక ఠంచనుగా ఆరింటికల్లా నిద్ర లేస్తున్నారు. పదింటిలోపు పనులు చక్కపెట్టుకోవడం కూడా అందుకు ఓ కారణం. ఇక మిగిలిన సమయాల్లో వీలైనంత విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతేకాక కుటుంబ సభ్యులతో కలిసి టీవీలు, సినిమాలు చూస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ఈ అలవాట్లే వారిని ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాయి. కట్టడితో ఒక్కసారిగా మారిన వారి లైఫ్ైస్టెల్ మొదటి రెండు రోజులు ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత నుంచి ఉత్సాహంగా ఉంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాత్రి 8 గంటలకే నిద్దురపోగలుగుతున్నామని అంటున్నారు. ఆరోగ్యంగా ఉన్న భావన కలుగుతున్నదని స్పష్టం చేస్తున్నారు. తీవ్ర పని ఒత్తిడితో రక్తపోటు, డయాబెటిస్, గుండె, కండరాల నొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దొరికిన లాక్డౌన్ సమయాన్ని మంచి ఆహారపు అలవాట్లు, సరైన నిద్ర కోసం వినియోగించుకుంటున్నామని తెలిపారు.
సమయం సందర్భం లేని ఆహారపు అలవాట్లు, నిద్ర లేమితో అనేక వ్యాధులు పొంచి ఉన్నాయి. సుమారు 80 శాతం పైగా రోగాలు సరైన విశ్రాంతి లేకపోవడంతోనే వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కాలంతో పాటు పరుగెత్తాల్సిన రోజులు కావడం.. పగలు రాత్రి అనే తేడా లేకుండా పని చేస్తుండటంతో ప్రతిఒక్కరూ అనారోగ్యం పాలవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా బీపీ, షుగర్, నీరసం లాంటి రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో మారిన జీవన విధానం వారిలో నూతనోత్తేజాన్ని తీసుకొస్తున్నంది.
ఒక్కోసారి తెల్లవారుజామున నాలుగైనా.. సరిగా నిద్ర పట్టేది కాదు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లడం.. ఆ తర్వాత నిద్ర రాకపోవడంతో మరుసటి రోజంతా నిరుత్సాహంగా ఉండేది. ముందే చేరుకుందామని ఏ రోజుకారోజు అనుకున్నా ఇంటికి వచ్చే సరికి మాత్రం రోజూ అదే సమయమయ్యేది. అయితే లాక్డౌన్ విధించాక ఎంతో సమయం మిగులుతున్నది. కావాల్సిన విశ్రాంతి దొరుకుతున్నది. కుటుంబంతో కాలక్షేపం చేయడంతో మా మధ్య ఆత్మీయత మరింతగా బలపడుతున్నది.ప్రశాంత్, వ్యాపారి
కుటుంబ సభ్యులతో గడిపే సమయం దొరికింది. పని ఒత్తిడి తగ్గింది. సమయానికి ఆహారం, నిద్ర పోతున్నాం. నగరంలో సాధారణంగా పగలు, రాత్రి తేడా కనిపించదు. వేళాపాళా లేని నిద్ర, ఆహారపు అలవాట్లతో అనేక ఇబ్బందులు తలెత్తేవి. ప్రస్తుతం లాక్డౌన్లో వ్యాపార లావాదేవీలు ఎలా ఉన్నప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా సరైన విశ్రాంతి, మంచి ఆహారం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. వ్యాపారంలో మునిగి ఈ విషయాలను విస్మరించాం. లత, వ్యాపారి.
వైద్యులు సూచించిన విధంగా ప్రణాళికా బద్ధంగా రోజువారీ జీవితాన్ని సాగించడం ఉరుకుల పరుగుల రోజుల్లో అయితే కుదరదు. ముఖ్యంగా నగరంలో పగలు, రాత్రి తేడా లేకుండా వ్యాపార కార్యకలాపాలు సాగుతుంటాయి. వాటికనుగుణంగా వ్యాపారాలను నిర్వహించాల్సిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో సరైన ఆహారం, నిద్ర కరువయ్యేది. కానీ..లాక్డౌన్తో మాత్రం కొంత ఉపశమనం దొరికిందనే చెప్పాలి. సమయానికి తింటున్నాం. కంటి నిండా నిద్ర పోతున్నాం. -శ్రీనివాస్, వ్యాపారి
శరీరంలో ఉత్పత్తయ్యే మెలటోనిన్ అనే హార్మోన్.. నిద్ర వచ్చేందుకు సహకరిస్తుంది. అలిసిన శరీరాన్ని సేద తీర్చడం అతిముఖ్యం. ఎంత చక్కగా నిద్ర పోతే అంతగా మానసిక ఆరోగ్యం బావుంటుంది. రాత్రి భోజనం చేశాక అరటిపండ్లు తీసుకోవాలి. వాటిలోని మెగ్నీషియం, సెరెటోనియం, మెలటోనియం లాంటి పోషకాలు మంచి నిద్రకు ఉపకరిస్తాయి. డిన్నర్లో హై ప్రొటీన్ ఉన్న ఆహారం కాకుండా పండ్లతో ముగిస్తే మంచి ఫలితాలుంటాయి. ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేయాలి. నిద్ర పోవడం అంటే శరీరానికి విశ్రాంతి ఇవ్వడమనే విషయాన్ని మరిచిపోకూడదు. -సనా ఫాతిమా, న్యూట్రీషనిస్టు.