సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): సరికొత్తగా కరెంట్ బిల్లు పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కరెంట్ బిల్లు పెండింగ్లో ఉందని, సాయంత్రంలోగా బిల్లు చెల్లించకపోతే కరెంట్ కట్ అవుతుందంటూ మెసేజ్ ఉన్న లింక్ వెంటనే ఓపెన్ చేసి బిల్లు చెల్లించాలంటూ పంపుతున్నారు. హైదరాబాద్లో చాలామందికి ఈ తరహ మెసేజ్లు వస్తున్నాయి. కరెంట్ బిల్లు కట్టిన వారికి కూడా ఇలాంటి మెసేజ్లు రావడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేశారు.
క్షణాల్లో డబ్బులు మాయం..
లింక్ ఓపెన్ చేయగానే వారి ఫోన్ నంబర్కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్కు సంబంధించిన డేటా హ్యాక్ చేస్తున్నారు. క్షణాల్లోనే ఖాతాల్లోంచి డబ్బు మాయమవుతున్నది. మహారాష్ట్ర, బీహార్ నుంచి కరెంట్ బిల్లు పెండింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 8967954941 నంబర్ నుంచి వినియోగదారులకు మెసేజ్లు వస్తున్నాయని, ఈ నంబర్ నుంచి వచ్చిన లింక్లను ఓపెన్ చేయొద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. వెంటనే 8135967194 కాల్ చేయాలని, వాట్సాప్ మెసేజ్ చేయమని వచ్చినా.. స్పందించవద్దని పేర్కొంటున్నారు.
ట్రూ కాలర్లో చెక్చేస్తే ఈ నంబర్ ఎలక్టిస్రిటీ పవర్ఆఫీస్, కరెంట్ ఆఫీస్ అస్సాం అడ్రస్తో ఉన్నటు తెలుస్తోంది.
మోసపూరిత మెసేజ్లు నమ్మవద్దు
-టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి
విద్యుత్ బకాయిలు, బిల్లుల పేరుతో కొంతమంది వ్యక్తులు తమ వినియోగదారులను ఫేక్ మెసేజ్లు పెట్టి మోసం చేస్తున్నారని, అటువంటి మెసేజ్లను వినియోగదారులు నమ్మి మోసపోవద్దని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు. సంస్థ పంపే మెసేజ్లలో విభాగం పేరు, యూఎస్సీ/సర్వీస్ నంబర్, వినియోగదారుని పేరు, బిల్లు ఉంటాయని తెలిపారు. అలాగే సంస్థ ఎప్పుడూ మొబైల్ నంబర్ నుంచి సందేశాలు పంపదని, సంస్థ ఉద్యోగులు వినియోగదారుల నుంచి చెల్లింపు రసీదు తప్ప బ్యాంక్ ఖాతా తదితర వివరాలు సేకరించరని అదే విధంగా సంస్థ బిల్లుల చెల్లింపు కోసం ఎలాంటి లింక్లు పంపదని స్పష్టం చేశారు.