సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 ( నమస్తే తెలంగాణ ) : దేవాదాయ ధర్మాదాయ శాఖలోని అర్చక ఉద్యోగులు సీఎం కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారని బ్రాహ్మణ పరిషత్ డైరెక్టర్ వెంకట రమణ అన్నారు. వాణీనగర్ విజయ వినాయక స్వామి దేవాలయంలో మల్కాజిగిరి దేవాదాయ శాఖ ఆలయ అర్చకుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అర్చక ఉద్యోగులకు పేస్కేల్ ఇచ్చి ఆదరించిన కేసీఆర్కు రుణపడి ఉంటామని చెప్పారు. అర్చకుల ఆరాధ్యదైవం కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చక ఉద్యోగుల స్థితి గతులు మార్చిన మహానీయుడు కేసీఆర్ అని కొనియాడారు.
నిత్యం భగవంతుడి సేవలో ఉంటూ.. సర్వేజనా సుఖినోభవంతు లోకాసమస్త సుఖినోభవంతు అని మనస్ఫూర్తిగా కోరేవారు అర్చకులని వివరించారు. అనంతరం విజయ వినాయక దేవాలయం అర్చకులు గౌరీభట్ల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ.. అర్చక కుటుంబాలు ఆనందంగా ఉంటూ.. ఆర్థికంగా బలోపేతం కావడానికి సీఎం కేసీఆర్ కారణమని చెప్పారు. అనంతరం జనమంచి శ్యాంసుందర్ శర్మ మాట్లాడుతూ.. బ్రాహ్మణులకు సమున్నత స్థానం దక్కిందంటే అది కేసీఆర్ ఘనతేనని అన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ.. రాష్ట్ర సుభిక్షం కోసం విజయ వినాయక దేవాలయంలో ఉదయం మహాన్యాస పూర్వక అభిషేకం, ఆయుష్షు హోం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు మల్లికార్జున శర్మ, రాంప్రసాద్ శర్మ, రామలింగేశ్వర శర్మ, అనంత సరస్వతీ దేవాలయం అర్చకులు మాడుగుల రాజశేఖర్ శర్మ, సాయికుమార్, ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అర్చకులు తులసి వెంకట రమణా చార్యులు, ఓల్డ్ మల్కాజిగిరి ఆంజనేయస్వామి ఆలయం అర్చకులు అకెళ్ల సాయిఫణీంద్ర శర్మ, సాయి శ్రీనివాస్ శర్మ, ఆలయ సిబ్బంది మల్లేశం, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.