నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): కూతురిపై ఓ కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడిన కేసులో జీవితఖైదు శిక్ష విధిస్తూ నాంపల్లిలోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి టి.అనిత సంచలన తీర్పు వెల్లడించారు. మైనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంచన్బాగ్ పోలీసు స్టేషన్ విచారణాధికారి వి.ఆనంద్ కేసు నమోదు చేసి వాంగ్మూలాల్ని నమోదు చేశారు. సాక్ష్యాధారాల్ని సేకరించి 2023లో చార్జీషీట్ను కోర్టుకు సమర్పించారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్రెడ్డి కథనం ప్రకారం మొదటి భార్యకు విడాకులిచ్చిన అనంతరం కూతురుపై శారీరకంగా లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో ఉన్న రెండో, మూడో ముద్దాయిలపై కేసును కొట్టివేస్తూ తీర్పు ప్రకటించారు. కూతురిపై జరిగిన లైంగిక దాడితో బాలిక గర్భం దాల్చినట్టు వైద్య పరీక్షలో తేలిందని, ఫోరెన్సిక్ రిపోర్టులను సైతం కోర్టుకు సమర్పించారు.
అదేవిధంగా తన సోదరిపై కూడా లైంగిక దాడికి పాల్పడినట్టు పేర్కొంది. గర్భం దాల్చకుండా గర్భ నిరోధక మాత్రలిచ్చేవాడని, అయినప్పటికీ గర్భం దాల్చినట్టు వైద్య పరీక్షలో బయటపడడంతో అబార్షన్ కూడా చేయించాడని ఫిర్యాదులో వివరించారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టిన కోర్టు నిందితుడు నేరం చేసినట్టు రుజువు కావడంతో శిక్షను ఖరారు చేసింది. రూ.50 వేల జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది.