తప్పనిసరిగా ఉండేలా ఏర్పాట్లు
అవసరమైన పుస్తకాలు, ఫర్నిచర్ ఇస్తాం
స్థానిక సంస్థలు పాఠశాలల బాధ్యత తీసుకోవాలి
‘మన ఊరు-మనబడి’తో పెనుమార్పులు
సమీక్షలోవిద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
బడంగ్పేట, జూన్ 25 : విద్యావ్యవస్థను పటిష్టం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ‘మన ఊరు-మనబడి’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. కావాల్సిన నిధులు కేటాయించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ‘బడిబాట’పై రంగారెడ్డి జిల్లాస్థాయి సమీక్ష సమావేశం శనివారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సామ యాదిరెడ్డి గార్డెన్స్లో జరిగింది. దీనికి మంత్రి విచ్చేసి ఆయా సమస్యలను ఆరాతీసి కొన్ని అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా విద్యాధికారులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యేక తరగతులు నిర్వహిం చాలన్నారు. ‘మన ఊరు-మనబడి’ని యజ్ఞంలా తీసుకొని పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
బడంగ్పేటలో జూనియర్ కళాశాల, తుక్కుగూడలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. దేశంలో తొలిసారి ఆన్లైన్, డిజిటల్ తరగతులను రాష్ట్రంలోనే ప్రారంభించామని, కరోనా కాలంలో విద్యాధికారులు, ఉపాధ్యాయులు చేసిన కృషి మరువలేనిదన్నారు. ప్రభుత్వ పాఠశాలల బాధ్యతను స్థానిక సంస్థలు తీసుకుంటే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని, పాఠశాలల్లో క్లీన్ అండ్ గ్రీన్ అంశాన్ని పాలకవర్గం చేపట్టాలని సూచించారు. విద్యార్థులు అధికంగా ఉండి టీచర్లు కొరత ఉన్న చోట ఉపాధ్యాయులను నియమించాలని డీఈవో సుశీంధర్రావు, ఎంఈవో కృష్ణయ్యలను ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట పుస్తకాలు, ఫర్నిచర్ సమకూరుస్తామని హామీఇచ్చారు.
నెలకు రూ.10 వేలు అందజేత
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలకు నెలకు రూ.10 వేలు ఇస్తామని మేయర్ చిగిరింత పారిజాత, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు తీర్మానం చేశారు. మిగతా వారు ఇలాగే ముందుకు రావాలని మంత్రి సూచించారు. ఎంఈవో కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, డీఈవో సుశీంధర్రావు, మేయర్లు దుర్గా దీప్లాల్ చౌహాన్, చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్లు తీగల విక్రంరెడ్డి, ఇబ్రాం శేఖర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, విద్యా కమిటీ చైర్మన్లు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.