సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : మహానగర ప్రజల తాగునీటి సరఫరాలో ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా జలాల నీటి నిల్వలపై జలమండలిలో ఆందోళన నెలకొన్నది. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వరద నీరు లేకపోవడంతో రాబోయే ఆరు నెలల పాటు డిమాండ్కు తగ్గట్లుగా కృష్ణా నీటిని అందించడం ఎలా అని అధికారుల్లో తర్జనభర్జన మొదలైంది. నాగార్జునసాగర్లో 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్కు తాగునీటిని అందించడానికి ఎత్తిపోతల సాధ్యమవుతుంది. అంతకంటే నీటి మట్టం తగ్గినట్లయితే అక్కడ పంపులను నడపడం సాధ్యం కాదు. ప్రస్తుతం సాగర్లో 521 అడుగుల నీటిమట్టం ఉంది. ఇదే తరుణంలో రెండు తెలుగు రాష్ర్టాల నీటి అవసరాలకుగాను 505 అడుగుల వరకు నీటిని వినియోగించుకునేందుకు ఒప్పందం కూడా జరగింది. ఈ క్రమంలోనే జలమండలి సాగర్లో 510 అడుగులు కచ్చితంగా మెయింటెన్ చేయాలని ఇరిగేషన్ శాఖకు లేఖ రాశారు.
ఒక పక్క లేఖ రాస్తూనే మరో పక్క సాగర్ ఫోర్షోర్లో అత్యవసర మోటార్లు ఏర్పాటు చేసి హైదరాబాద్కు నీటిని అందించే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు దాదాపు రూ. 2 కోట్లతో అత్యవసర పంపింగ్కు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. షార్ట్ టెండర్ ప్రక్రియను త్వరగా ముగించి రాబోయే ఆరు నెలల పాటు అత్యవసర పంపింగ్ ద్వారా సాగర్ నుంచి నగరానికి మూడు దశల ద్వారా రోజూ 270 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్ ఫర్ డే) నీటిని తరలించేందుకు సిద్ధమవుతున్నారు. 2017 సంవత్సరంలో అత్యవసర పంపింగ్ ద్వారా సాగర్ నుంచి నీటి జలాలను తరలించినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వానకాలంలో నాగార్జునసాగర్కు జూలై, ఆగస్టుల్లో వరద వచ్చే అవకాశాలున్నాయి. అంటే దాదాపు ఏడెనిమిది నెలల పాటు ఉన్న నీటి నిల్వలతోనే సరిపెట్టుకోవాలి. ఏపీ ధోరణి చూస్తుంటే కనీసంగా 15 టీఎంసీల నీటినైనా వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రానున్న వేసవిలో అత్యవసర మోటార్లు తప్పవనే వ్యాఖ్యలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి.
మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేజ్-1లో మిరాలం, అలియాబాద్ ఆఫ్ టేక్ ప్రాంతం వద్ద నున్న 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. చాంద్రాయణగుట్టలోని సన్నీ గార్డెన్ నుంచి షోయబ్ హోటల్ వరకు బాక్స్ డ్రైయిన్ పనులకు ఇబ్బందుల్లేకుండా ఈ జంక్షన్ పనులు చేస్తున్నారు. 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ 24 గంటల పాటు పలు రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. మిస్రిగంజ్, బహదూర్పుర, కిషన్బాగ్, జహనుమా, మొఘల్పుర, దారుల్షిఫా, సుల్తాన్ షాహీ, పత్తర్గట్టి, అల్జుబైల్ కాలనీ, ఆలియాబాద్, గౌలిపుర, తలబ్కట్ట, రియాసత్నగర్ ప్రాంతాలలో నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.
కోటి 20 లక్షల జనాభాకు పైబడిన హైదరాబాద్ మహానగరంలో జలమండలి వివిధ రిజర్వాయర్ల నుంచి రోజూ 555 నుంచి 560 ఎంజీడీల మేర నీటిని తరలిస్తూ ప్రజలకు రోజూ విడిచి రోజూ నీటిని సరఫరా చేస్తున్నది. కృష్ణా నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 160, సింగూరు, మంజీరాల నుంచి 103 , ఉస్మాన్సాగర్ నుంచి 14 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. హిమాయత్సాగర్ నుంచి ప్రస్తుతం నీటి సేకరణ జరగడం లేదు. డేడ్కేటెడ్ స్టోరేజీగా హిమాయత్సాగర్ను ఉంచినప్పటికీ వచ్చే వేసవిలో అవసరాల మేరకు ఈ రిజర్వాయర్ నుంచి పాతనగరానికి నీటిని అందించి కృష్ణా జలాల ప్రాంతాలకు సర్దుబాటు చేయనున్నారు. ఒక్క కృష్ణా జలాలు తప్ప అన్ని రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, కృష్ణా జలాలను సమర్థవంతంగా తరలిస్తామని అధికారులు తెలిపారు. మొత్తంగా ప్రతి ఏడాది 50 ఎంజీడీల అదనపు నీటిని తరలించి వేసవి డిమాండ్ను గట్టెక్కే పరిస్థితి నుంచి ఈ సారి అదనపు జలాలు లేక నీటి కష్టాలు తప్పవన్న సంకేతాలు కనబడుతున్నాయి.