సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వచ్చేశాయి. ప్రతి యేటా అన్ని పూజలకు ఆది దేవుడైనా గణపయ్యను ప్రతిష్టించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక సేవా సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్కై ఫౌండేషన్, జగతి ఫౌండేషన్, హెల్పింగ్ స్పాట్, ఎంవీ ఫౌండేషన్ తదితర సంస్థలు మట్టితో తయారు చేసిన గణపయ్యలకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చాయి. అందులో భాగంగా నగరంలోని స్కూల్స్, హాస్టల్స్, కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా గతయేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా చాలా మంది ఇండ్లలో పూజించేందుకు మట్టి గణపతుల కోసం ఆరా తీస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తయారీదారులు అధికంగా మట్టి గణపతులను తయారు చేస్తున్నారు.
బంకమట్టి విగ్రహాలే ఉత్తమం
కాలుష్య సమస్య నుంచి గట్టెక్కేందుకు బంకమట్టితో తయారు చేసిన విగ్రహాలే ఉత్తమమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా నిమజ్జనం చేసిన తర్వాత కుంటలు, చెరువుల్లో నీటి వనరులకు ఎలాంటి హాని ఉండదని వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సహా కృత్రిమ రంగుల్లో పాదరసం, సీసం, కాడ్మియం, క్రోమియం వంటి విషపూరిత రసాయనాలు నిక్షిప్తమై ఉంటాయని, ఇవి నేలపై చేరి తీవ్ర హాని తలపెడుతాయని తెలిపారు. కూరగాయలు, ఆకు కూరలతో పాటు నీటిలో ఉండే చేపలు, రొయ్యలు ద్వారా మనిషి శరీరంలోకి రసాయనాలు చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. కొన్ని ఏండ్లు గడిచినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నేలలో కలవక పర్యావరణానికి ముప్పు తెస్తుంది. క్యాన్సర్తోపాటు మూత్రపిండాలు, కాలేయం, జీర్ణకోశ, చర్మ సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒక ఉద్యమంలా ప్రజలు మట్టి గణపతులకు జై కొట్టాలని నిపుణులు కోరుతున్నారు.
ఆన్లైన్ క్విజ్ పోటీలు
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మట్టి గణపతుల ప్రాధాన్యతను వివరించడంతో పాటు అందుకు సంబంధించిన క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నది. విద్యార్థులను ఎక్కువగా మట్టి గణపతుల అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేల చేసేందుకు వారి కోసం ఆన్లైన్ క్విజ్ ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు క్విజ్ పోటీలు జరుగుతున్నాయి. అంతేకాదు విజేతలకు బహుమతులు కూడా ప్రదానం చేయనున్నారు. రూ.10లక్షల వరకు నగదు బహుమతులు అందించనున్నారు. పోటీల్లో పాల్గొనేవారు ‘ఎకో ఫ్రెండ్లీ గణేశ్ ఉత్సవ్’ను బాధ్యతగా తీసుకోవాలని పీసీబీ పిలుపునిచ్చింది. క్విజ్ పోటీలు ముగిసిన తర్వాత ఈ-సర్టిఫికెట్స్ మెయిల్ చేయనున్నారు. ఈ బహుమతులను ఏదైన ప్రత్యేకమైన రోజున ఈవెంట్ నిర్వహించి ప్రముఖులతో ప్రదానం చేయించనున్నట్టు పీసీబీ అధికారులు వివరించారు. క్విజ్కు సంబంధించిన లింక్ టీఎస్పీసీబీ వెబ్సైట్లో ఉంచినట్లు చెప్పారు.