కొండాపూర్ : వేసవి సెలవుల్లో నచ్చిన ఆటలో ఆరితేరేలా సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువారం చందానగర్ పీజేఆర్ స్టేడియంలో శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్ల సమ్మర్ కోచింగ్ క్యాంపు -2022ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై డైరక్టర్ స్పోర్ట్ ఎస్ఎం భాషా, జాయింట్ కమిషనర్ స్పోర్ట్ తిప్పర్తి యాదయ్య, కార్పొరేటర్లు మంజుల రఘునాథరెడ్డి, పుష్ప నాగేష్, శ్రీకాంత్లతో కలిసి ప్రారంభించారు.
అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ చిన్నారులు వేసవి సెలవులను ప్రణాళిక ప్రకారం తమకు నచ్చిన ఆటల్లో నేర్పరులుగా తయారయేందుకు సమ్మర్ కోచింగ్ క్యాంపులను వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యతలను వెలికితీసేందుకు కృషి చేయాలన్నారు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన వారిని ఆ దిశలో ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకుంటారన్నారు. క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం చేకూరుతుందన్నారు. సీడీసీ నిధులతో త్వరలో పీజేఆర్ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తి ప్రతిష్టతలను ఇమడింపజేసేలా పిల్లలు క్రీడల్లో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ సర్కిల్ -21 డిప్యూటీ కమిషనర్ సుధాంష్, మాజీ కౌన్సిలర్ రఘుపతిరెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్రెడ్డి, నాయకులు రాజశేఖర్రెడ్డి, అమిత్, మన్విత, తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులో ఉన్న ఆటలు…
పీజేఆర్ స్టేడియంలో కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులో బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, క్రికెట్, రోలర్ స్కేటింగ్, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, యోగా, వాలీబాల్, బాక్సింగ్, కరాటే, క్యారమ్స్, టెన్నికాయిట్, చెస్, ఖోఖో తదితర క్రీడలు అందుబాటులో ఉన్నాయి.
సమ్మర్ క్యాంపు మే 31వ తేదీ వరకు కొనసాగుతుంది. క్రీడాకారులకు అవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్లు పీజేఆర్ స్టేడియం యాజమాన్యం తెలిపింది.