హైదరాబాద్ : సాంకేతిక పరంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సమ్మిళితమయ్యే సామాజిక ప్రభావాన్ని సృష్టించడంపై దృష్టి సారించి, సమాజానికి ఉత్తమమైన ఆవిష్కరణలను రూపొందించాలని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు. శనివారం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ), బాల వికాస సంస్థ (Bala Vikas) ఆధ్వర్యంలో సామాజిక వ్యాపారవేత్తలు రూపొందించిన ఉత్పత్తులు, ఆవిష్కరణ ప్రదర్శన(సోషల్ స్టార్టప్ ఎక్స్పో)ను కీసరలోని బాల వికాస క్యాంప్లో నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్నకు తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం త్వరలో కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకురాబోతోందని వెల్లడించారు. రాబోయే సంవత్సరాల్లో తెలంగాణను సామాజిక పారిశ్రామిక వేత్తల రాజధానిగా మార్చే లక్ష్యంతో పనిచేస్తామన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలు చేస్తూ, సామాజిక ఆవిష్కరణలు రూపొందించాలన్నారు. ఈ సందర్బంగా టీ హబ్( T-Hub), బాల వికాస సీఎస్ఆర్బీ మధ్య అవగాహన ఒప్పందాన్ని మంత్రి సమక్షంలో రెండు సంస్థ ప్రతినిధులు కుదుర్చుకొన్నారు. కార్యక్రమంలో అరవింద్ ఐకేర్ సిస్టమ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేష్ ప్రజ్ఞ, బివి రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ విష్ణురాజు, బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరి రెడ్డి సింగారెడ్డి, బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్ రాహుల్ భరద్వాజ్ పాల్గొన్నారు.