సిటీబ్యూరో, జనవరి 30(నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పనులను వేగవంతం చేసే దిశగా అధికారులు చర్యలు వేగిరం చేస్తున్నారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి దానకిశోర్ మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జలమండలి ఈడీ డాక్టర్ ఎం.సత్యనారాయణ, ఎంఆర్డీసీఎల్ ఎస్ఈ వెంకట రమణ, రెవెన్యూ అధికారిణి చంద్రకళలతో కలిసి టిప్పు ఖాన్ బ్రిడ్జి నుంచి బాపూఘాట్ వరకు పర్యటించారు. అనంతరం దానకిశోర్ అధికారులతో సమీక్షించారు. బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు మూసీ బఫర్ జోన్లో ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించాలని రెవెన్యూ అధికారులకు దానకిశోర్ ఆదేశించారు.
ప్రభుత్వ స్థలాలు, చారిత్రక కట్టడాలను గుర్తించాలని చెప్పారు. పాత రెవెన్యూ రికార్డులను సమీక్షించాలన్నారు. మూసీలో బోటింగ్ అసవరమైన స్థలాన్ని గుర్తించాలని, ఇందుకు బ్యారేజి ఎక్కడ అవసరమో చూడాలన్నారు. బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశమై మూసీ సుందరీకరణకు సంబంధించిన సమగ్రమైన నివేదికను సిద్ధం చేయాలని దానకిశోర్ సూచించారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమయానికి మూసీ సుందరీకరణపై పీపీటీ (పవర్ పాయింట్ ప్రజంటేషన్) సిద్ధంగా ఉంచాలని అధికారులకు దాన కిశోర్ ఆదేశాలు జారీ చేశారు.