సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : సీసీ కెమెరాలు.. డ్రోన్ కెమెరాల నిఘాతో గణేశ్ నిమజ్జనోత్సవానికి పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. ఆయా ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ రెండు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 31,694 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు కమిషనర్లు తమ కమిషనరేట్ పరిధిలోని బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు.
డ్రోన్ టీమ్లతో బందోబస్తు ..
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 26,694 మంది సిబ్బందితో పాటు 125 ప్లాటూన్ల స్పెషల్ ఫోర్స్ను బందోబస్తుకు నియమిస్తున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. వీటితో పాటు ఆర్ఏఎఫ్ ఫోర్స్, మల్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్స్, డాగ్ స్కాడ్, యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్, షీ టీమ్స్తో పాటు ఐదు డ్రోన్ టీమ్లతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు 19 కిలోమీటర్ల మేర ప్రధాన నిమజ్జన ర్యాలీ ఉంటుందన్నారు. 28న టీఎస్పీఐసీసీలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, విద్యుత్, వాటర్, ఆర్టీఏ, మెడికల్ తదితర విభాగాలతో కలిసి పూర్తిస్థాయిలో ఉమ్మడి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పని చేస్తుందన్నారు. సీపీతో పాటు నగర అదనపు సీపీ విక్రమ్సింగ్ మాన్, ట్రాఫిక్ డీసీపీ సుధీర్బాబు, జాయింట్ సీపీ (ఎస్బీ) విశ్వప్రసాద్ తదితరులు ఉన్నారు.
ఆరు వేల మందితో బందోబస్తు ..
రాచకొండ పోలీస్ కమిషనరేట్లో నిమజ్జనానికి ఆరు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు మరో వెయ్యి మంది అదనపు బలగాలు సిద్ధంగా ఉంచామని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. మంగళవారం నేరెడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ మహంతి, ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, డీసీపీ(ఎస్బీ) బాలస్వామితో కలిసి నిమజ్జన ఏర్పాట్లు, బందోబస్తుపై విలేకరుల సమావేశంలో వివరించారు. కమిషనరేట్ పరిధిలో సరూర్నగర్, రాంపల్లి, సఫీల్గూడ, కాప్రా, నల్లచెరువు, ఎదులాబాద్ చెరువులు ప్రధానమైనవని తెలిపారు. హుస్సేన్సాగర్ తరువాత సరూర్నగర్కు భారీ స్థాయిలో విగ్రహాలు వస్తాయని వివరించారు. సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఉంటుందని, కమిషనరేట్ కార్యాలయం, ఉప్పల్, ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయాలలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి నిమజ్జన కార్యక్రమాన్ని సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తామన్నారు.
డీజే వద్దు.. భక్తి గీతాలు ముద్దు
అబిడ్స్, సెప్టెంబర్ 26: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన కో ఆర్డినేషన్ సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ పాల్గొని మాట్లాడారు. వినాయక నిమజ్జనంలో డీజేలను వాడకపోవడం మంచిదన్నారు. భక్తి గీతాలను ఆలపిస్తూ ముందుకు సాగాలన్నారు. వినాయక నిమజ్జనం సాఫీగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వివరించారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి విజ్ఞప్తి మేరకు మండపాల నిర్వాహకులు ఉదయమే తమ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంతరావు మాట్లాడుతూ.. నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, రామరాజు, ఉత్సవ సమితి నేతలు కరోడిమల్, శ్రీరామ్ వ్యాస్, ఆర్టీఏ జాయింట్ కమిషనర్ పాండురంగ నాయక్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, డీసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ శబరీష్ తదితరులు పాల్గొన్నారు.
సైబరాబాద్లో 12 వేలకు పైగా విగ్రహాలు
సైబరాబాద్లో 12 వేలకు పైగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మంగళవారం ఆయన కమిషనరేట్ ఫరిధిలోని పలు ప్రాంతాలలో గణపతి ఉత్సవాలను, నిమజ్జన వేడుకలను పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బాలానగర్ జోన్లోని ఐడీఎల్, చందానగర్ చెరువుల వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
వినాయక లడ్డూను దక్కించుకున్న మైనార్టీ సోదరుడు షబ్బీర్
మౌలాలి డివిజన్ పరిధి హనుమాన్నగర్లో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన గణేశ్ మండపంలో మంగళవారం వినాయక లడ్డూ వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మైనార్టీ సోదరుడు షబ్బీర్ రూ.95వేలకు పాటపాడి లడ్డూను కైవసం చేసుకున్నారు. సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు లడ్డూను షబ్బీర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వినోద్యాదవ్, కాలనీ అధ్యక్షుడు నరసింహ ముదిరాజ్, ఉపాధ్యక్షులు అరుంధతి, అసోసియేషన్ సభ్యులు మల్లేశ్, జగదీశ్, సుబ్బు, నాని, నర్సింగ్, నవీన్, అనిరుధ్, భరత్, తదితరులు పాల్గొన్నారు.
-గౌతంనగర్, సెప్టెంబర్ 26