సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఏపీలో తయారై నిషేధిత బీటీ-3/హెచ్టీ విత్తనాలు కోళ్ల దాణా పేరుతో మహారాష్ట్ర మీదుగా తెలంగాణకు తెచ్చి రైతులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఒక ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి రూ.70 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది పంటలు సీజన్ కావడంతో నకిలీ విత్తనాలు విక్రయించే వారు మార్కెట్లోకి వచ్చి రైతులను మోసం చేసే అవకాశం ఉండటంతో ఎస్ఓటీ ఎల్బీనగర్ డీసీపీ మురళీధర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీ విత్తన వ్యాపారులపై నిఘాను కొనసాగించారు. ఈ క్రమంలోనే నకిలీ విత్తనాల విక్రయ ముఠా గుట్టురట్టయింది. ఈ వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
కృష్ణాజిల్లాకు చెందిన రావి ప్రసన్నకుమార్ 20 ఏండ్ల కిందట చౌటుప్పల్ ప్రాంతానికి జీవనోపాధి కోసం వచ్చి అక్కడే స్థిరపడ్డాడు, పదేళ్లుగా నవతా ఆగ్రో డివిజన్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ పేరుతో దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. నకిలీ విత్తనాలు విక్రయించి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్కు చెందిన గడ్డం రవీంద్రబాబు 8 ఏండ్ల కిందట మహారాష్ట్ర నాగ్పూర్కు వెళ్లి అక్కడ కుహి అనే గ్రామ పరిధిలో 60 ఎకరాల భూమి లీజ్కు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఎదో ఒకటి చేసి భారీ ఎత్తున డబ్బు సంపాదించాలని రవీంద్రబాబు ప్లాన్ చేశాడు. ఇందుకు తెలంగాణలో నిషేధించిన బీటీ-3/హెచ్టీ విత్తనాలను రైతులకు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు చిత్తూరు జిల్లాలో నకిలీ విత్తనాల తయారీదారు అయిన నర్సింహులును సంప్రదించాడు. తనకు బీటీ-3 సీడ్స్ సరఫరా చేయాలని ఒప్పందం చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే చౌటుప్పల్కు చెందిన ప్రసన్నకుమార్తో రవీంద్రబాబుకు పరిచయం ఏర్పడిందని సీపీ చెప్పారు. తన వద్ద విత్తనాలు ఉన్నాయి, వాటిని మీ దగ్గరకు తరలిస్తాను.. అక్కడి నుంచి ప్యాకెట్లను గ్రామీణ ప్రాంతాలకు తరలించి మంచి లాభాలు పొందవచ్చని వీరు ఒప్పందం చేసుకున్నారు. అయితే, విత్తనాల పేరుతో రవాణా చేస్తే దొరికిపోతామని, ప్యాకెట్లపై చిక్స్ ఫీడ్ పేరు రాసి వాటిని ట్రాన్స్పోర్టు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే సంచుల్లో నింపారు. మొదట 45 కిలోలు మాత్రమే చౌటుప్పల్కు పంపించారు. ఈ 45 కిలోల నకిలీ విత్తనాలు రాగానే ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ నేతృతంలోని బృందం వాటిపై నిఘా పెట్టింది. అప్పడే ఆ ముఠాను పట్టుకుంటే మూలాలు దొరకవని భావించిన పోలీసులు.. పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల స్టాక్ వస్తుందని భావించి మూలాల వరకు వెళ్లాలని ఎదురు చూశారు. ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గురువారం చౌటుప్పల్లోని ప్రసన్నకుమార్ గోడౌన్పై దాడిచేసి 2200 కిలోల బీజీ-3/హెచ్టీ కాటన్ సీడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వాటి నాణ్యతను పరీక్షించగా.. అవి తెలంగాణలో నిషేధించిన విత్తనాలుగా తేలింది. ఈ విత్తనాలు వాడటం వల్ల భూసారం మొత్తం పాడవ్వడం, గడ్డిమొత్తం చనిపోతుందని వెల్లడైంది. ఈ మందులు వాడటం వల్ల మనుషుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ విత్తనాలను ప్రభుత్వం నిషేధించినట్లు సీపీ పేర్కొన్నారు. నిందితులు రవీంద్రబాబు, ప్రసన్నకుమార్ను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న చిత్తూరుకు చెందిన నర్సింహులు కోసం గాలిస్తున్నామన్నారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి 44 సంచుల్లో ఉన్న 22 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు, కియా కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నకిలీ విత్తనాలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని సీపీ తెలిపారు. రైతులు లైసెన్స్ ఉన్న సర్టిఫైడ్ ఫర్టిలైజర్స్ దుకాణం నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. గుర్తింపు ఉండి, నాణ్యమైన విత్తనాలను విక్రయించే వారి జోలికి వెళ్లమని సీపీ తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించి రైతులకు నష్టం కలిగించే వారిపై మాత్రం ఉక్కుపాదం మోపుతామని సీపీ హెచ్చరించారు.