సిటీబ్యూరో/మన్సూరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): ఉన్మాది దాడిలో గాయపడిన సంఘవి ఆస్పత్రిలో క్రమంగా కోలుకుంటున్నది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని దవాఖాన హెల్త్ బులిటెన్ విడుదలజేసింది. అక్క, తమ్ముడిపై కత్తితో దాడి చేసి, ఒకరి మృతికి కారకుడైన ప్రేమోన్మాది శివకుమార్ను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఎల్బీనగర్, ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న సంఘవి, పృథ్వీతేజ(22)పై కత్తితో దాడి చేయగా.. పృథ్వీతేజ మృతి చెందాడు. సంఘవి గచ్బిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడి నేపథ్యాన్ని తెలుసుకునే క్రమంలో క్షణికావేశంలో తన తండ్రిపై సుత్తెతో దాడి చేశాడు. తండ్రి దవాఖానలో చికిత్స పొందుతూ మూడేళ్ల కిందట మృతి చెందాడనే విషయం బయటకు వచ్చింది. అసలు ఏమి జరిగిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన సురేందర్గౌడ్ కూతురు సంఘవి, కొడుకు పృథ్వీ పదో తరగతి షాద్నగర్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు. వారితో పాటు షాద్నగర్ ఫరూఖ్నగర్ మండలం నేరళ్లచెరువుకు చెందిన శివకుమార్ కూడా చదువుకున్నాడు. అప్పటి నుంచి శివకుమార్, సంఘవి వెంటపడుతున్నాడు. పదో తరగతి తర్వాత అక్కా, తమ్ముళ్లు మహబూబ్నగర్లో ఇంటర్ పూర్తి చేశారు. నీట్ పరీక్ష రాసిన సంఘవి, రామంతాపూర్లోని హోమియోపతి వైద్య విద్యలో చేరింది.
ఈ క్రమంలోనే పదో తరగతి పూర్వ విద్యార్థులందరూ కలుసుకున్నారు. అప్పుడు సంఘవి అడ్రస్ తెలుసుకున్న శివకుమార్ పెండ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం ఆమెతో మాట్లాడాలని, పెండ్లికి ఒప్పంచేందుకు కర్మన్ఘాట్లో ఉండే తన సోదరిని తీసుకొని ఆర్టీసీ కాలనీలోని సంఘవి వద్దకు వెళ్లాడు. ఆమె పెండ్లికి నిరాకరించడంతోఅక్కడి నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం తిరిగి శివకుమార్ సంఘవి వద్దకు వచ్చి వేధిస్తుండటంతో అది చూసిన పృథ్వీ నిలదీయడంతో గొడవ జరిగి, కత్తిపోట్ల వరకు దారి తీసింది. కాగా, సంఘవి, పృధ్వీతో పాటు మరో ఇద్దరు సోదరులు కూడా నివాసముండగా ఆదివారం వారు పెండ్లికి వెళ్లారు. వాళ్లు లేరనే ఉద్దేశంతోనే శివ ఇంటి వరకు వచ్చాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
గతంలో తండ్రిపై సుత్తెతో దాడి ..?
మూడేండ్ల కిందట తన తండ్రి శంకరయ్యతో ఇంట్లో గొడవ జరిగింది. ఈ గొడవలో క్షణికావేశంతో సైకోగా మారి సుత్తెతో తండ్రిని కొట్టడంతో అతడు అపస్మారక స్థితికి వెళ్లాడు. దవాఖానలో చేర్పించగా 10 రోజుల పాటు చికిత్స పొంది మృతి చెందాడు. అయితే, భర్త చనిపోవడం, కొడుకు జైలుకు వెళ్తే తాను రోడ్డు పాలవుతానని, పోలీసులకు ఈ విషయం చెప్పొద్దని గ్రామ పెద్దలను కోరడంతో ఎవరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. తాజాగా జరిగిన దాడి కేసులో అరెస్టయిన శివకుమార్ గతంపై వారి స్వగ్రామంలోనూ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రైవేట్ వ్యక్తులను డ్రైవర్లు, కండక్టర్లుగా తాత్కాలికంగా ఆర్టీసీ తీసుకుంది. ఈ సమయంలో బస్సు టికెట్ చార్జీలు ప్రయాణికుల నుంచి తీసుకొని, డిపోల్లో డిపాజిట్ చేయలేదని కూడా చర్చించుకుంటున్నారు. అయితే, ఈ విషయాలు తమ దృష్టికి రాలేదని ఎల్బీనగర్ పోలీసులు పేర్కొంటున్నారు. రికార్డులలో ఎక్కడా కూడా కేసులు నమోదు కాలేదని తెలుస్తుందని, దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు.
సంఘవి ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్
ఉన్మాది చేతిలో గాయాలకు గురైన సంఘవికి ఏఐజీ దవాఖానలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని దవాఖాన చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి హెల్త్ బులిటెన్లో వెల్లడించారు. ముఖం, వెన్నుముఖకు తీవ్ర గాయాలయ్యాయని, నిపుణులైన వైద్యులతో చికిత్స అందిస్తున్నామన్నారు.