Crime News | మన్సూరాబాద్, ఫిబ్రవరి 4 : గంజాయి విక్రేతలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా, కనగల్ మండలం, లచ్చిగూడెంకు చెందిన గజ్జి సాయిశ్రీకాంత్ (21) ప్రస్తుతం ఎల్బీనగర్లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. నల్గొండ జిల్లా, తిరుమలగిరి, కొంపల్లికి చెందిన తుడుం ధనుంజయ్ (19) ప్రస్తుతం మన్సూరాబాద్ ఓల్డ్ విలేజ్లో ఉంటూ కారు మెకానిక్గా పని చేస్తున్నాడు. జగిత్యాల జిల్లా, కొడిమ్యాలకు చెందిన అడ్లగట్ట హర్షన్ (21) ప్రస్తుతం టీకేఆర్ కమాన్ సమీపంలోని సిద్ది వినాయక హాస్టల్లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. మహబూబ్నగర్ జిల్లా, కల్వకుర్తి, ఉరుకొండ గ్రామానికి చెందిన లింగేశ్వర్ మల్లికార్జున్ (20) ప్రస్తుతం టీకేఆర్ కమాన్ సమీపంలోని సిద్దివినాయక హాస్టల్లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు.
గజ్జి సాయిశ్రీకాంత్, తుడం ధనుంజయ్, అడ్లగట్ట హర్షన్, లింగేశ్వర్ మల్లికార్జున్ స్నేహితులు. జల్సాలకు అలవాటు పడిన గజ్జి సాయిశ్రీకాంత్, తుడుం ధనుంజయ్ తమకు తెలిసిన మరో ఇద్దరి వద్ద గంజాయి కొనుగోలు చేసి అడ్లగట్ట హర్షన్, లింగేశ్వర్ మల్లికార్జున్కు విక్రయిస్తున్నారు. గంజాయి క్రయవిక్రయాలు జరుపుతున్న తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు శనివారం సాయంత్రం మన్సూరాబాద్ రోడ్డులోని హెచ్పీ పెట్రోల్ పంపు వద్ద నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.32,500 వేల విలువైన 1.30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 బైకులు, 2 సెల్ఫోన్లను సీజ్ చేశారు. కేసుతో ప్రమేయమున్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.