ఆర్కేపురం, మే 22 : తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవానికి కలెక్టర్ హరీశ్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి హాజరై ప్రారంభించారు. 3 రోజులపాటు కొనసాగే ఈ క్రీడా పోటీలకు రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాలకు సంబంధించిన జట్లు పాల్గొన్నాయి. 11 క్రీడా అంశంలో పోటీలు నిర్వహించనున్నారు. మొదటి రోజు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడాకారులు అన్ని క్రీడల్లో రాణించి రంగారెడ్డి జిల్లాకు ప్రథమ బహుమతి తీసుకురావాలన్నారు. సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు నగదు బహుమతితో పాటు ఇండ్ల స్థలాలు ఇస్తున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలోని విద్యార్థులను క్రీడల్లో భాగస్వాములు చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
15 నుంచి 35 సంవత్సరాలు ఉన్న యువతీ, యువకులు తమకు నచ్చిన క్రీడల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్గుప్తా, కందుకూరు ఆర్డీవో సూరజ్ కుమార్, జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్రావు, రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి, తెలంగాణ పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు రాఘవరెడ్డి, ఎస్.జి.ఎఫ్ కార్యదర్శి భాస్కర్రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మహేశ్, సరూర్నగర్ సర్కిల్ డీసీ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.