ఎల్బీనగర్, మార్చి 31 : దేశంలోనే తెలంగాణ రాష్టం వేగంగా అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ విజన్ కారణమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం గడ్డిఅన్నారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సాయిగార్డెన్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే పటిష్టమైన శాంతిభద్రతలతోపాటుగా సమర్థవంతమైన పరిపాలన సాగుతుండడంతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో దూసుకెళ్తుందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం గతంలో ఎలా ఉండేది.? ప్రస్తుత అభివృద్ధి ఎలా ఉందన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని రూ.3వేల కోట్లతో అన్ని రంగాల్లో సమగ్రవంతంగా అభివృద్ధి చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోకవర్గంలోని జాతీయ రహదారితోపాటు సాగర్ హైవే, ఇన్నర్ రింగు రోడ్డులలో ట్రాఫిక్ చిక్కులకు చెక్కు పెడుతూ రూ.658 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్పాసులు నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీర్చిదిద్దామని వివరించారు. ఇతర దేశాల్లో తన అనుయాయులకు లబ్ధి చేకూర్చడానికి ప్రధాని మోదీ బ్రోకర్ పనులు చేస్తున్నారని విమర్శించారు. దేశావ్యాప్తంగా బ్యాంకులను ముంచిన వ్యాపారులు 21 మంది ఉంటే వారిలో 20 మంది గుజరాతీ రాష్ర్టానికి చెందిన వారేనని, వారిలో ఎవరూ కూడా అరెస్టు కాలేదని విమర్శించారు.
ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి అన్ని రాష్ర్టాలకు స్ఫూర్తిగా మారిందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగిన సమగ్ర అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతూ రాబోయే ఎన్నికల్లో ఎల్బీనగర్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, బబ్బురి ఆనంద్గౌడ్, రమేశ్ ముదిరాజ్, బాలసుందరం, ప్రేమ్గౌడ్, ప్రతీక్, రమణ, బాలగౌడ్, పడిదం కృష్ణారెడ్డి, గండి సన్నీ యాదవ్, విక్కీ, మల్లికారెడ్డి, శైలజ, విజయలక్ష్మి, యాద శంకర్, సుమ్ము రాములు తదితరులు పాల్గొన్నారు.