న్యూఢిల్లీ, జూలై 10: ఉమ్మడి పౌర స్మృతిపై ఏకాభిప్రాయం లేకున్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు తొందరపాటు చర్యలు చేపట్టిందా? తాను అనుకున్న మూడు లక్ష్యాలను పూర్తి చేసుకోవాలన్న ఆత్రుత తప్ప గొప్ప ఆలోచన లేదా? అంటే.. అవునన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370.. తర్వాత ఇప్పుడు యూసీసీపై తన గురిపెట్టిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూసీసీపై 2016లోనే లా కమిషన్ దీనిపై వ్యాఖ్యలు చేసింది. అప్పటి నుంచి దీనిపై చర్చ నడుస్తున్నది. మెజారిటీ వర్గాలు యూసీసీని తప్పుబడుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో ఇలాంటివి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని వాదించాయి. అయితే, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో యూసీసీ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టబోతున్నదన్న చర్చ నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభలో ఆ పార్టీ బలాబలాలు పరిశీలిస్తే రాజ్యసభలో బిల్లు ఆమోదం నంబర్ గేమ్లా ఉండనున్నది.
రాజ్యసభలో బీజేపీ పరిస్థితి ఇలా..
రాజ్యసభలో బీజేపీకి 91 సీట్లు ఉన్నాయి. ఐదుగురు నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. అంతా కలిపితే 96. కానీ, బిల్లు ఆమోదానికి 119 మార్కు దాటాలి. అయితే, ఎన్డీయే కూటమిలో ఈశాన్య రాష్ర్టాల నుంచి మేఘాలయ (ఎన్పీపీ), నాగాలాండ్ (ఎన్డీపీపీ), మిజోరం (ఎమ్ఎన్ఎఫ్) యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి. అస్సాం (ఏజీపీ) తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉన్నది. ఆ పార్టీలకు రాజ్యసభలో నాలుగు ఎంపీ సీట్లు ఉన్నాయి. అయితే, వైసీపీ, బీజేడీ లాంటి పార్టీలు ఎన్డీయేలో భాగస్వాములు కానప్పటికీ, బీజేపీతో స్నేహంగా మెలుగుతున్నాయి. ముఖ్యంగా బిల్లుల ఆమోదం సందర్భంగా మద్దతు తెలుపుతున్నాయి. అయితే, యూసీసీపై అవి తమ అభిప్రాయాలను తెలపలేదు. ఈ పార్టీలకు చెరో 9 మంది ఎంపీలు ఉన్నారు. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే అన్నాడీఎంకే, టీడీపీ మద్దతు తెలిపే చాన్స్ ఉన్నదని ఎన్డీయే వర్గాల సమాచారం. ఆ రెండు పార్టీలకు ఐదు సీట్లున్నాయి.సూత్రప్రాయ మద్దతు ఇస్తామని ఆప్ తెలిపింది. ఇక, రామ్దాస్ అథవాలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి చిన్న పార్టీలు బిల్లు ఆమోదంలో కీలక పాత్ర పోషించనున్నాయి. 5-10 ఓట్లే ఎక్కువ ప్రభావితం చూపనున్నాయి.