సిటీబ్యూరో, మార్చ్ 10(నమస్తే తెలంగాణ): తన వ్యక్తిత్వాన్ని.. తన కుటుంబాన్ని కించపరిచేలా ఇన్స్టాలో పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నటి లావణ్యత్రిపాఠి కొణిదెల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. పర్పుల్ క్రెయాన్00 పేరుతో ఉన్న ఇన్స్టాఖాతా ద్వారా తనపై, తన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని పలు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని.. ఇందులో చాలా అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటూ ఆమె వాపోయారు.
సంబంధిత ఇన్స్టా ఖాతా నడుపుతున్న వ్యక్తిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఖాతాలో తనపై చేసిన పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని లావణ్య పోలీసులను కోరారు. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు సంబంధించిన ఐపీ అడ్రస్, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.