సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: సామాన్య ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోలేని రోగాలను అధునాతమైన శస్త్ర చికిత్సలను ఉస్మానియా దవాఖాన ఉచితంగా చేస్తుంది. సర్జరీలకు, చికిత్సలకు భయపడి ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకునే రోగాలకు సైతం ఆధునిక పద్ధతిలో కోత లేకుండా ఉస్మానియా చికిత్సలు అందిస్తుంది. అరుదైన శస్త్ర చికిత్సలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఉస్మానియా దవాఖానలో నిరుపేదలకు ఆర్ధికంగా ఊరట కలిగించేలా ఖరీదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా కోత లేకుండా జరిపే లేజర్ శస్త్ర చికిత్సలను విజయవంతంగా జరుపుతున్నారు ఉస్మానియా వైద్యులు. కార్పొరేట్ దవాఖానల్లో రూ.లక్ష నుంచి 1.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ ఖరీదైన లేజర్ సర్జరీలను ఉస్మానియాలో పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నారు. 2015లోనే దవాఖానలో లేజర్ మిషన్కు సంబంధించి నిధులు మంజూరవగా 2019లో యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో కూడా ఉస్మానియాలో లేజర్ సర్జరీలు జరిగినప్పటికీ తక్కువ సంఖ్యలో నిర్వహించేవారు. ఆధునిక వైద్య సదుపాయాలు పెరగడంతో ప్రస్తుతం, లేజర్ శస్త్ర చికిత్సల సంఖ్యను పెంచడంతో రోగులకు ఊరట లభిస్తోంది.
ప్రధానంగా పైల్స్, ఫిస్టులా, వెరికోస్ వెయిన్స్ తదితర సమస్యలతో బాధపడుతున్న రోగులకు లేజర్ కిరణాలతో సర్జరీ చేస్తారు. ఎక్కువగా పైల్స్(అర్ష మొలలు)తో బాధపడే రోగులకు ఈ లేజర్ శస్త్ర చికిత్స ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా పైల్స్, ఫిస్టులా, వెరికోస్ వెయిన్స్ తదితర సమస్యలు ప్రారంభ దశలో మాత్ర మే ఔషధాలతో తగ్గుతాయి.
సాధారణంగా ఒక రోగికి కోతతో కూడిన శస్త్ర చికిత్స జరిపితే రోగి కోలుకునేందుకు 10 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. కాని, కోత లేకుండా చేసే శస్త్ర చికిత్సల ద్వారా రోగి త్వరగా కోలుకుంటాడు. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే, కోత లేకుండా రెండు రకాలుగా శస్త్ర చికిత్సలు జరుపుతారు. అందులో ఒకటి ల్యాప్రోస్కోపిక్ పద్ధతి. ఈ పద్ధతిలో చిన్నిపాటి రంధ్రం చేసి శస్త్ర చికిత్స జరుపుతారు. ఎక్కువగా క్యాన్సర్ రోగులకు, కాలేయ సంబంధిత రోగులకు ఈ పద్ధతిని వినియోగిస్తారు. రెండోది లేజర్ పద్ధతి. ఈ పద్ధతిలో ఎక్కువగా కంటి వ్యాధులకు సంబంధించి శస్త్ర చికిత్స జరుపుతారు. అంతే కాకుండా పైల్స్, ఫిస్టులా, వెరికోస్ తదితర సమస్యలకు సైతం లేజర్ శస్త్రచికిత్స చేస్తున్నారు.
సాధారణంగా లేజర్ శస్త్ర చికిత్స వంటివి కార్పొరేట్ దవాఖానాల్లోనే నిర్వహిస్తారు. ఈ తరహా చికిత్సలకు లక్షల్లో ఖర్చవుతుంది. దీంతో ఇలాంటి చికిత్సలు నిరుపేదలకు అందని ద్రాక్షగానే ఉండేవి. తెలంగాణ సర్కార్ వచ్చిన తరువాత అలాంటి ఖరీదైన శస్త్ర చికిత్సలను సర్కార్ దవాఖానాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు.
కార్పొరేట్ దవాఖానలలో లక్ష రూపాయల వరకు అయ్యే ఖర్చును ఉస్మానియాలో ఉచితంగా లేజర్ ట్రీట్మెంట్ పద్ధతిన శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నం. ఈ పద్ధతిన సర్జరీలు చేసుకోవడం ద్వారా మరోమా రు వచ్చే అవకాశం ఉండదు. గడిచిన ఆరు నెలల్లో పది మంది రోగులకు లేజర్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించాం. – డాక్టర్ పల్లం ప్రవీణ్;
ఐదేండ్లుగా అర్ష మొలలతో బాధపడుతున్నా. ఈ వ్యా ధితో తీవ్రంగా నొప్పి అయినప్పుడు స్థానిక దవాఖానలలో చూపించుకున్నా తగ్గలేదు. నాల్రోజుల కింద నొప్పి ఎక్కువైంది. దీంతో ఉస్మానియాకు వచ్చిన. దవాఖానలో అడ్మిట్ చేసుకున్న వైద్యులు లేజర్ శస్త్ర చికిత్స చేసిన్రు. ఆపరేషన్ జరిగినంక ఒక్క రోజులోనే లేచి నడిచిన. పేదలకు ఉస్మానియా అండగా ఉంది. – జి.శివ, కల్వకుర్తి;