మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. జిల్లా పరిధిలోని శామీర్పేట్, ఘట్కేసర్, కుత్బుల్లాపూర్, బాలానగర్, కాప్రా, నారపల్లి, కీసర, ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జోరుగా రిజిస్ట్రార్లు జరుగుతున్నాయి. దీంతో మార్చి నెలలో మొత్తం 19,251 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. గత నెలతో పోల్చితే మరో 1,153 రిజిస్ట్రేషన్లు అదనంగా జరిగాయి. వీటి ద్వారా కేవలం ఒక మార్చినెలలోనే రూ.165.46 కోట్ల వరకు ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు. గత నెల కంటే ఈ నెల మరో రూ.10కోట్లు అదనంగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో మార్చిలో 2,300 రిజిస్ట్రేషన్లు కాగా రూ.28.84 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. బంజారాహిల్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో 4,012 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగగా రూ.56.17 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పోల్చితే హైదరాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్య స్వల్పంగా తగ్గింది.