సిటీబ్యూరో, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): స్థలంపై కన్నుపడితే చాలు.. నకిలీ పత్రాలు సృష్టించి.. రంగంలోకి దిగుతారు.. ఆస్తి తమదేనంటూ.. యజమానులతో గొడవ పడతారు. ఎవరైనా ఎదురు తిరిగితే కోర్టుల్లో కేసులు సైతం వేస్తారు. ఇలా నకిలీ పత్రాలే అసలైనవిగా చిత్రించి.. బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాలు నగరంలో సంచరిస్తున్నాయి. వీళ్లతో ఎందుకొచ్చిన తలనొప్పి అని కొందరు బాధితులు ఎంతో కొంత ముట్టజెప్పి వాళ్ల పీడ వదిలించుకుంటున్నారు. ఈ తరహా ఆగడాలపై తరచూ సీసీఎస్కు ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీసులు సైతం వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. కబ్జాగ్యాంగ్లపై నిఘా పెట్టి..ఉక్కుపాదం మోపుతున్నారు.
టోలిచౌక్కు చెందిన ముస్తఫా కమల్ సిద్దిఖి మరికొందరితో కలిసి గ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. నకిలీ సేల్డీడ్ కాపీలు, ఇంటినంబర్లు, అఫిడవిట్లు ఇలా అ న్ని ఫోర్జరీ డాక్యుమెంట్లను ఈ ముఠా సభ్యులు తయా రు చేస్తారు. ఎంచుకున్న ఇల్లు లేదా స్థలం వద్దకు వెళ్లి అది తమదంటూ.. అందులో ఉండే యజమానులతో గొడవకు దిగి.. బెదిరింపులకు పాల్పడుతుంటారు. భ యపడకుంటే, ఆ నకిలీ పత్రాలతో కోర్టుల్లో కేసులు వే స్తుంటారు. జూబ్లీహిల్స్ సొసైటీలో 473-కె-3, 473 -ఎల్-3 స్థలాలు తమవంటూ నకిలీ పత్రాలతో య జమానులను బెదిరించడంతో వారంతా సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి శుక్రవారం ప్రధాన నిందితుడు కమల్ సిద్దిఖిని అరెస్ట్ చేయగా, సహ నిందితులు సయ్యద్ అహ్మద్ దార్మని, మణీఫ్ అలీఖాన్ పరారీలో ఉన్నారని సీసీఎస్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. ఈ ముఠాపై వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం ఎనిమిది కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు.
ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను నకిలీ పత్రాలతో కబ్జాకు యత్నించే ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు సిటీ పోలీసులు. వెస్ట్జోన్, సౌత్జోన్లో ఎక్కువగా ఇలాంటి గ్యాంగ్లు ఉంటున్నాయి. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.