సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ప్రపంచంలోనే తొలి సామాజిక మాధ్యమంగా అమెచ్యూర్ రేడియో అని, రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనూ వీటి సేవలను విరివిగా ఉపయోగించారని లామాఖాన్ అమెచ్యూర్ రేడియో నిర్వాహకులు అన్నారు. బంజారాహిల్స్లోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీలో శనివారం లామాఖాన్ అమెచ్యూర్ రేడియో క్లబ్(లార్క్) ఆరో వార్షిక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఔత్సాహిక రేడియో కమ్యూనికేషన్ నిపుణులు, రేడియో ఇంజినీర్లతోపాటు, అమెచ్యూర్ రేడియో నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. రెండ్రోజుల సదస్సు నేటితో ముగియనుండగా, దేశంలోని 400కు పైగా అమెచ్యూర్ రేడియో నిపుణులు, నిర్వాహకులు సదస్సుకు హాజరయ్యారు. టెక్నికల్ సెషన్లో భాగంగా ఈ రంగంలో వచ్చిన మార్పులు, ఆధునిక టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీ ప్రాధాన్యత, అమెచ్యూర్ రేడియో ప్రయోజనాలు, ఈ రంగంలో చోటు చేసుకున్న మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సదస్సు ముఖ్యోద్దేశాలను నిర్వాహకులు వివరించారు. కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించిన లామాఖాన్ అమెచ్యూర్ రేడియో క్లబ్ ప్రెసిడెంట్ శశిభూషణ్ మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీకి అమెచ్యూర్ రేడియో నాంది పలికిందన్నారు. లామాఖాన్ అమెచ్యూర్ రేడియో క్లబ్ సభ్యులుగా ఈ రంగంపై ఆసక్తి కలిగిన ఎంతో మంది ఔత్సాహికులు పనిచేస్తున్నారని, వీరిందరికీ ప్రత్యేక శిక్షణ, టెక్నికల్ సెషన్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అమెచ్యూర్ రేడియో ఔత్సాహికులు ఆవుల అమరేంద్ర మాట్లాడుతూ ప్రపంచంలోని తొలి సోషల్ మీడియా వేదికగా అమెచ్యూర్ రేడియో నిలుస్తుందన్నారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనే వీటిని వినియోగించారు. సమాచార మార్పిడిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీకి అమెచ్యూర్ రేడియో టెక్నాలజీ నాంది పలికిందన్నారు. ముఫకంజా ఈసీఈ శాఖాధిపతి అయేషా నాజ్ మాట్లాడుతూ… టెక్నాలజీ రీసెర్చీ, డెవలప్మెంట్కు ఈ తరహా కార్యక్రమాలతో సాధ్యమవుతుందని ముఫకంజా ఇంజినీరింగ్ హెచ్వోడీ అయేషా నాజ్ అన్నారు. లామాఖాన్ అమెచ్యూర్ రేడియో క్లబ్ ద్వారా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందన్నారు. అనంతరం సదస్సులో ఏర్పాటు చేసిన స్టాళ్లను లార్క్ సభ్యులు సందర్శించారు. రేడియో టెక్నాలజీలో వినియోగించే పరికరాలు, విడి భాగాలు, త్రీడీ ప్రింటింగ్ విధానాలను పరిశీలించారు. ఆదివారం 10గంటల నుంచి టెక్నికల్ సెషన్ ప్రారంభం కానుండగా, వర్క్ షాప్, బహుమతుల పంపిణీ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో లార్క్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస రెడ్డి, ఔత్సాహిక అమెచ్యూర్ రేడియో నిర్వాహకులు పాల్గొన్నారు.