సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఎంతో చరిత్ర కలిగిన ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం అసెంబ్లీలోని సమావేశ మందిరంలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, అధికారులతో కలిసి మంత్రి పలు అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. సీఎం కేసీఆర్ గతంలో అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన సందర్భంలో ఆలయ విస్తరణ, అభివృద్ధిని చేపడుతామని ప్రకటించారని మంత్రి తలసాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీఎం ఇచ్చిన హామీ మేరకు ఆలయ విస్తరణకు అవసరమైన 1100 గజాల స్థలాన్ని గుర్తించినట్లు చెప్పారు. విస్తరణకు అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు భూ యజమానులు కూడా సానుకూలంగా ఉన్నారని, భూ పరిహారంగా అందించేందుకు ప్రభుత్వం రూ.8.95కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కంచన్బాగ్, ఉప్పుగూడ, జంగంమెట్లలో మల్టీ పర్పస్ ఫంక్షన్హాల్స్ నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం రూ.19కోట్లు మంజూరు చేసిందన్నారు. ఉప్పుగూడలో చేపట్టబోయే నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, మిగతా వాటికి త్వరితగతిన టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
సంబంధిత పనులకు పది రోజుల్లో భూమి పూజ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, కలెక్టర్ అమోయ్ కుమార్, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ సీఈ జియా ఉద్దీన్, జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.