మల్కాజిగిరి, అక్టోబర్ 5 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఝూటా మాటలు చెబుతారని, ప్రజలు వాటిని నమ్మవద్దని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. గురువారం మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ భరోసా యాత్ర నిర్వహి ంచారు. ఈ యాత్ర అల్వాల్ సర్కిల్లో మొదలై ఓల్డ్ అల్వాల్ ఐజీ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నియోజకవర్గానికి చేసిందేమీలేదని, కాంగ్రెస్ వాళ్లు ప్రచారానికి వస్తే ప్రజలు నిలదీయాలన్నారు.
ఆ పార్టీ చేసిన మోసాలకు డిపాజిట్ కూడా రాదని, ప్రజలు వారిని నమ్మొద్దని సూచించారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటారని, భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నిరాశకు లోనుకావద్దని భరోసానిచ్చారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలువాలన్నారు. పేదలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెలా పింఛన్ అందజేస్తున్నారని చెప్పారు.
దళితబంధు పథకంతో అర్హులైన వారికి రూ.10లక్షలతో యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. మైనారిటీలకు రెసిడెన్షియల్ స్కూల్స్, మైనారిటీ బంధు, బీసీలకు బీసీబంధు అందజేస్తున్నామని తెలిపారు. తాగు, సాగునీరు, ఐటీ ఉద్యోగాలు, రోడ్లు, మహిళలకు రిజర్వేషన్తో పాటు అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్వన్గా ఉన్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి ఉద్ఘాటించారు.
అందరికీ ఉచితంగా వైద్య సేవలు: బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి
ప్రజలందరికీ అరుంధతి దవాఖాన ద్వారా ఉచితంగా వైద్య సేవలందిస్తున్నామని మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. భరోసా యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ… మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. ఆపదలో ఆదుకుంటానని భరోసానిచ్చారు. అమ్మ పేరుతో అరుంధతి దవాఖానను దుండిగల్లో ఏర్పాటు చేశామని, గుండెతో పాటు అన్ని వైద్య సేవలు ఉచితంగా ఉందజేస్తున్నామన్నారు. ఉచిత వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, సునీతరాము యాదవ్, మీనాఉపేందర్ రెడ్డి, మురుగేశ్, మాజీ కార్పొరేటర్లు జగదీశ్ గౌడ్, ఆకుల నర్సింగరావు, కో ఆప్షన్ సభ్యురాలు జ్యోతిగౌడ్, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి, పరశురాంరెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి, రాముయాదవ్, ఉపేందర్రెడ్డి, అనిల్కిశోర్, ఖలీల్, రాజేశ్కన్న, మోసిన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.