మేడ్చల్, ఏప్రిల్ 4: తెలంగాణ మోడల్ కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మేడ్చల్ పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, టీఆర్ఎఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి తదిరతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయ ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 210 కార్పొటర్, కౌన్సిలర్ స్థానాలకు గాను 190 సీట్లు విజయం సాధించామని, 61 సర్పంచ్ స్థానాలకు 54 స్థానాలను బీఆర్ఎస్ గెలుపొందిందన్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ, సహకారం సంఘాలు తదితర ఏ ఎన్నికలైనా బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని, చరిత్ర సృష్టించిందని తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో 434 మంది ప్రజా క్షేత్రంలో పోరాడి విజయం సాధించారని తెలిపారు. పార్టీలో కష్టపడే పని చేసే వారికి కచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలు, అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు సేవచేసి రుణం తీర్చుకుంటామని అన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయడమే కాకుండా తాము నెలకోల్పిన దవాఖాన ద్వారా కూడా ఉచితంగా సేవలు అందజేస్తున్నామని ఆయన చెప్పారు. నేతలు, కార్యకర్తలకు మధ్య ఉన్న అగాధాన్ని పూరించేందుకు ఆ ఆత్మీయ సమ్మేళనం అన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మేడ్చల్ పట్టణ అధ్యక్షుడు శేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి విష్ణుచారి, మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మేడ్చల్లో నిర్వహించిన మేడ్చల్ మున్సిపాలిటీ ఆత్మీ య సమ్మేళనం విజయవంతమైంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. మహిళా కార్యకర్తలు సైతం భారీగా తరలివచ్చారు. ప్రతి వార్డు నుంచి ర్యాలీగా తరలివచ్చి, సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులకు మంత్రి మల్లారెడ్డి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పదవులు, పథకాల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సభ విజయవంతం కావడంతో మేడ్చల్ బీఆర్ఎస్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. పలువురు నాయకులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు. మంత్రి మల్లారెడ్డిని వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీతో గెలిపించుకునే సిద్ధమని అన్నారు.
ఆత్మీయ సమ్మేళనం విజయవంతం కావడానికి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేశారు. వారం రోజుల ముందు నుంచి మేడ్చల్ మున్సిపాలిటీ ఉన్న నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులతో సమావేశమయ్యారు. అందరినీ సమన్వయపరిచి, ఏకతాటిపైకి తీసుకువచ్చారు. ఒక కార్యకర్తలా పని చేశారు. సభ జరిగే సమయంలో కూడా వేదికపై లేకుండా కార్యకర్తలు, నాయకుల కోసం జరుగుతున్న భోజన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి ఆయన పనితీరును ప్రత్యేకంగా ప్రశసించారు. క్రమశిక్షణ గల నాయకులు, కార్యకర్తలనే బీఆర్ఎస్ అధిష్టానం కోరకుంటుందని అన్నారు.
రాబోయే ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలి. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది. నేతలు, నాయకులు మధ్య ఉన్న గ్యాప్ను సవరించుకునేందుకు, కష్ట,నష్టాలను తెలుసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. రెండు నెలలకోమారు నాయకులు తమ పరిధిలో సమావేశాలు నిర్వహించుకొని, కార్యకర్తలకు భరోసా కల్పించాలి. 9 ఏండ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు అందుతున్నాయి. మేడ్చల్కు నీళ్లు తీసుకువచ్చాం. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో వేల కోట్లు పెట్టుడులు రాష్ర్టాన్ని తరలివచ్చి, నిరుద్యోగ యువకు ఉపాధి లభించిందన్నారు.
-మలిపెద్ది సుధీర్ రెడ్డి,
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే
మోదీకి దీటైన నేత కేసీఆర్. ఆయనతోనే దేశానికి న్యాయం జరుగుతుంది. బీజేపీని నమ్మితే బతుకులు ఆగం అవుతాయి. నవంబర్లో ఎన్నికలు రానున్నాయి. ప్రతి నాయకులు, కార్యకర్త బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి. కష్టపడే కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. అలాంటి వారిని మంత్రి గుర్తించాలి.
-నారెడ్డి నందారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు, మేడ్చల్
కార్యకర్తలే నేతలకు బలం. వారి కృషి వల్లే మేమంతా వేదికపై నిలబడుతున్నాం. మంత్రి మల్లారెడ్డి నిరంతం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి చేస్తున్నారు. కార్యకర్తలెవరూ నిరాశ పడవద్దు. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో మల్లారెడ్డిని గెలిపించుకుందాం.
-మర్రి దీపికారెడ్డి, మున్సిపాలిటీ చైర్పర్సన్, మేడ్చల్
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేతో పాటు ఎంపీ స్థానాన్ని గెలిపించుకోవాలి. ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా కూడా పార్టీకి చెందిన వ్యక్తే ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో గతంలో జరిగిన పొరపాటు జరగకుండా కట్టపడాలి.అందరం ఏకమై బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుందాం.
-భాస్కర్ యాదవ్,
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మేడ్చల్