కాప్రా, ఏప్రిల్ 12: చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న కారు డ్రైవర్ను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మూడు బంగారు పుస్తెల తాళ్లు (67 గ్రాములు), బైకుతో సహా మొత్తం రూ.5,58,000 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండ జిల్లాకు చెందిన పుట్ట హరికృష్ణ ఉపాధి కోసం వచ్చి చెంగిచర్లలో నివాసముంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తాగుడు, గుట్కాలకు అలవాటుపడిన అతడికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి.
డబ్బు కోసం నేరాల బాట పట్టాడు. ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లోనుంచి బంగారు గొలుసులను దొంగిలించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతడు కుషాయిగూడ, కీసర, సైదాబాద్ పోలీసుస్టేషన్ల పరిధిలో మూడు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. అతడిపై నిఘా పెట్టిన పోలీసులు చెంగిచర్లలోని మెరీడియన్ పాఠశాల వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేసి, అతడి నుంచి మూడు బంగారు గొలుసులు, బైకును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.