కేపీహెచ్బీ కాలనీ, జనవరి 5 : కూకట్పల్లి నియోజకవర్గం తుది ఓటరు జాబితా ప్రకారం 4,26,465 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం కూకట్పల్లి నియోజకవర్గం ఈఆర్వో, డీసీ రవికుమార్ తుది ఓటరు జాబితాను ప్రచురించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుది ఓటరు జాబితా ప్రకారం కూకట్పల్లి నియోజకవర్గంలో 4,26,465 మంది ఓటర్లు ఉండగా పురుషులు 2,24,070, స్త్రీలు 2,02,276, ఇతరులు 119 మంది ఉన్నారు. నియోజకవర్గంలో 410 పోలింగ్ బూత్లను గుర్తించడం జరిగింది. ముసాయిదా ఓటరు జాబితాతో తుది ఓటరు జాబితాను పోల్చితే కొత్తగా నియోజకవర్గంలో 8,018 మంది ఓటర్లు జాబితాలో చేరారు. నవంబర్లో విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం నియోజకవర్గంలో 4,18,447 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 2,20,285, స్త్రీలు 1,98,048, ఇతరులు 114 మంది ఓటర్లు ఉన్నారు.
కొత్తగా ఓటరు జాబితాలో పురుషులు 3,785, స్త్రీలు 4,228, ఇతరులు 5 మంది చేరినట్లు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ తర్వాత రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించి.. క్షేత్రస్థాయిలో బీఎల్వోలతో పరిశీలించిన తర్వాత డూప్లికేట్ ఓట్లను తొలగించడంతో పాటు అర్హులైన కొత్త ఓటర్లకు ఓటరు జాబితాలో చేర్చడం జరిగింది. పలు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని.. అర్హులైన వారు ఆన్లైన్లో ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు చేర్పులకు కూడా అవకాశముంటుందన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రతియేటా నాలుగుసార్లు.. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కును కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం సిబ్బంది రమేశ్, ఆనంద్ ఉన్నారు.