కేపీహెచ్బీ కాలనీ(హైదరాబాద్) : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR) ముందుచూపుతో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Mla Krishna Rao) అన్నారు. ఆదివారం కూకట్పల్లి డివిజన్లోని కాలనీలు, బస్తీలలో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరం శాంతి భద్రతల(Law and Order) కు కేరాఫ్ అడ్రస్గా మారడంతో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారని, దీని వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. మరోవైపు పేదలందరికీ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే మెరుగైన పాలన అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని వెల్లడించారు.
కూకట్పల్లిలో పుట్టి పెరిగి ప్రజల ఆశీర్వాదంతో పదేండ్లుగా ఎమ్మెల్యేగా సేవలందించానని, కూకట్పల్లిని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసి రుణం తీర్చుకున్నానని పేర్కొన్నారు. పదేండ్ల క్రితం కూకట్పల్లిలో తాగునీటి(Drinking Water) కష్టాలతో మహిళలు ఇబ్బందులు పడేవారని, తాగునీటి కష్టాలను తీర్చేందుకు భారీ రిజర్వాయర్(Reservior) ను నిర్మించి పైప్లైన్ వ్యవస్థను ఆధునీకరించినట్లు తెలిపారు.
ఎన్నికలు రాగానే కూకట్పల్లికి సంబంధం లేని వ్యక్తులు బరిలో దిగడం ప్రజలకు మాయమాటలు చెప్పి ఎన్నికలు కాగానే పరారు కావడం జరుగుతుందని, ఇలాంటి స్వార్థపరుల మాటలను ప్రజలు నమ్మొద్దని కోరారు. కాంగ్రెస్, జనసేన పార్టీల అభ్యర్థులు కూకట్పల్లి సమస్ల గురించి, ప్రజల గురించి అవగాహన లేదని ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో చిచ్చులు పెట్టి ప్రజలమధ్య విద్వేషాలు నింపేందుకు వస్తున్న ఆ నేతలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.