సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ) : నగరంలో మరో అత్యాధునిక వైకుంఠధామం అందుబాటులోకి రానున్నది. బేగంపేట ధనియాల గుట్టలోని శ్యామ్లాల్ బిల్డింగ్ వద్ద 4 ఎకరాల్లో రూ. 8.54 కోట్లతో ఈ ‘మహాపరినిర్వాణ’ను నిర్మించారు. అంతిమ సంస్కారాలకు అవసరమయ్యే వసతుల కల్పనతో పాటు పార్కింగ్, వైఫై, రెండు అంతిమ యాత్ర వాహనాలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించారు. మంగళవారం మంత్రి కేటీఆర్ ఈ మోడ్రన్ వైకుంఠధామాన్ని ప్రారంభించనున్నారు.
నిన్నటివరకు అక్కడ ఉన్న శ్మశాన వాటిక సమస్యలకు కేంద్రంగా ఉండేది. ముఖ్యంగా అంత్యక్రియలు చేసే వారు, అందులో పాల్గొనేందుకు వచ్చే వారికి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ముఖచిత్రం మారింది. హైదరాబాద్ నగరంలో రహదారులు, ఫ్లైఓవర్లు, పార్కులు ఇలాంటి సదుపాయాలే కాదు… అత్యంత కీలకమైన చివరి మజిలీ ప్రాంగణాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నది. మృతుడి బంధువులకు సకల సౌకర్యాలు ఉండటంతో పాటు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లతో మోడ్రన్ వైకుంఠధామాలను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా బేగంపేటలోని ధనియాల గుట్టలో రూ.8.54 కోట్లతో నిర్మించిన ‘మహా పరినిర్వాన (వైకుంఠధామం)’ విశ్వనగర మౌలిక వసతుల స్థాయికి అద్దం పడుతుంది.
ఈ వైకుంఠదామాన్ని మంగళవారం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. బేగంపేట ధనియాల గుట్ట పరిధిలోని శ్యామ్లాల్ బిల్డింగ్ వద్ద నాలుగెకరాల స్థలంలో మోడ్రన్ వైకుంఠధామంను సకల సౌకర్యాలతో నిర్మించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణం, సెరిమోనియల్ హాల్, చెక్క నిల్వ గది, పిండ ప్రదానం చేసే ప్రాంతం, వెయిటింగ్ హాల్, బాడీ ప్లాట్ఫారంలు, ఫీచర్ గోడలు, ప్రవేశం, నిష్క్రమణకు తోరణాలు, ఫలహారశాల, నీటి వసతి సహా టాయిలెట్ బ్లాక్ల ఏర్పాటు, పాదచారుల మార్గం అభివృద్ధి, పార్కింగ్, వైఫై సౌకర్యం, సీఎస్ఆర్ పద్ధతిన శివుని విగ్రహ ఏర్పాటు, రెండు అంతిమ యాత్ర వాహనాలు వంటి అన్ని రకాల సౌకార్యలు కల్పించారు. మంగళవారం ఉదయం మంత్రి కేటీఆర్ దీనిని పార్రంభించనున్నందున అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందులో పాల్గొననున్నారు.