ఆలోచన… సమాజంలో విధ్వంసాన్ని రేపగలదు. అందుకే ఆలోచన తీరు ఎలాంటిదనేది ఆ నాయకుల దృక్పథానికి అద్దం పడుతుంది. తాజా ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిపై విజన్-2047 ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చిన వందేండ్లు పూర్తయ్యే నాటికి హైదరాబాద్ నగరం ఇలా ఉండాలనే అద్భుతమైన ఆకాంక్షను కేటీఆర్ తన పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజల ముందుంచారు.
సాధించింది చాలా ఉంది… సాధించాల్సింది ఇంకా ఉంది… భవిష్యత్ హైదరాబాద్ అభివృద్ధికి తమ ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళికతో సిద్ధంగా ఉంది. ఫ్యూచర్ రెడీ హైదరాబాద్ (భవిష్యత్ హైదరాబాద్) పేరుతో వచ్చే పదేండ్లలో చేపట్టే 13 అత్యంత కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని అభివృద్ధి చేయనున్నామని మంత్రి కేటీఆర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏడు మార్గాల్లో 792 కిలోమీటర్ల పర్యావరణహితమైన, అత్యంత వేగవంతమైన ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్టు సిస్టం (ఆర్ఆర్టీఎస్) ఏర్పాటుకు ప్రతిపాదించారు. పదేండ్లలో అవుటర్కు అనుగుణంగా సహా గ్రేటర్ నలుదిక్కులా 415 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ఎంచుకున్నారు. నగరంలో 24 గంటల నీటిసరఫరా, వరద నివారణ, సేఫ్ సిటీలో భాగంగా భవిష్యత్లో మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికత వినియోగంతో పాటు పర్యాటక హబ్గా హైదరాబాద్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా స్పష్టం చేశారు. అదేవిధంగా 2036 నాటికి హైదరాబాద్ను ఒలింపిక్ గేమ్స్కు వేదిక చేయాలనే బృహత్తర లక్ష్యాన్ని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే కొన్నిరోజుల కిందట బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై స్పష్టం చేసిన విజన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రవాణా వ్యవస్థలో భాగంగా నగరంలో సొరంగాలు నిర్మిస్తానని ప్రకటించారు. కానీ, వాస్తవంగా నిపుణుల అభిప్రాయం మేరకు… హైదరాబాద్ నగరం సొరంగాల నిర్మాణానికి అనువైనది కావచ్చుగానీ.. మెట్రో వంటి ప్రజా రవాణాతో పోలిస్తే వ్యయం మూడు రెట్లు ఉండటంతో పాటు సాంకేతిక సమస్యలు అనేకం ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్. 45 నుంచి కేబీఆర్ పార్కు వరకు మూడు మార్గాల్లో సుమారు ఐదు కిలోమీటర్లు ఇదే తరహాలో సొరంగం నిర్మించేందుకు కొంతకాలం కిందట ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ అధ్యయనం చేసిన కమిటీ సాధ్యం కాదని నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో సొరంగాలు అంటే సాధ్యమేనా..అంటే సమాధానం లేని ప్రశ్నే.
సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అనగానే మనం ఎప్పుడైనా చూపించేది చార్మినార్ను.. కానీ ఇప్పుడు కొత్త హైదరాబాద్ను డిజిటల్ మాధ్యమాల్లో విసృ్తతంగా చూపిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో సరికొత్త నగరాన్ని ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. అలాంటి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసింది. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో మేము చూసే హైదరాబాద్, మేము కలలు కనే హైదరాబాద్ ఏంటంటే…? వారసత్వంగా మనకు లభించిన హైదరాబాద్ను మనం కాపాడుకుంటూనే, కొత్తగా వస్తున్న సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటూ భవిష్యత్ తరాలకు మెరుగైన హైదరాబాద్ను ఇవ్వాలన్నది మా ఉద్దేశం. దానికి సంబంధించి కొన్ని అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. అందులో భాగంగా విజన్ 2047 పేరుతో ప్యూచర్ రెడీ హైదరాబాద్ ప్రణాళికను అమలు చేసే లక్ష్యంతో ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్లో మొదటి దశలో 69 కి.మీ మెట్రో మార్గం అందుబాటులో ఉంది. ఫేజ్-2లో 67.5 కి.మీ మార్గాన్ని రాయదుర్గం-శంషాబాద్ విమానాశ్రయం మధ్య (31 కి.మీ), బీహెచ్ఈఎల్- లక్డీకాపూల్ల మధ్య (26 కి.మీ), నాగోల్-ఎల్బీనగర్ల మధ్య 5 కి.మీ, ఎంజీబీఎస్-ఫలక్నుమాల మధ్య 5.5 కి.మీ నిర్మిస్తాం. అదేవిధంగా ఫేజ్-3ఎలో 142 కి.మీ, ఫేజ్-3బీ కింద ఓఆర్ఆర్ చుట్టూ రింగు మెట్రో రైలు మార్గాన్ని 136 కి.మీ మేర నిర్మించాలని ప్రతిపాదించామని తెలిపారు.
వర్షాకాలంలో పట్టణాలు ముంపునకు గురికావడం ఘటనలు పట్టణాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరద నివారణకు ప్రభుత్వం ముందుగానే ప్రజలను భాగస్వాములను చేస్తూ వరద ప్రభావానికి గురి కాకుండా చేయడం. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, గవర్నెన్స్ను అమలు చేయనున్నారు. కొత్తగా వరదనీటి కాలువల నిర్మాణం, సీవరేజ్ వ్యవస్థను మెరుగుపర్చడం, రిజర్వాయర్లు, చెరువులను సంరక్షించడం లాంటి చర్యలు చేపట్టనున్నారు.ఇందుకోసం 20వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. వరద ముంపు నగరంలో లేకుండా చేయాలన్న ప్రణాళిక ప్రభుత్వం రూపొందించింది.
నగరంలో 2036 నాటికి ఒలింపిక్స్ గేమ్స్ను నిర్వహించేందుకు వేదికగా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. స్పోర్టింగ్ ఇన్ఫ్రాను చాలా పెంచాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఎల్బీ స్టేడియంతో పాటు ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు, క్రీడాకారులు కలిసి పని చేయడం వల్ల హైదరాబాద్ క్రీడల్లో ఆకట్టుకునే పర్యాటక ప్రదేశంగా మారుతుందన్నారు. ఇవన్నీ సాధ్యమైతే హైదరాబాద్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ నిర్వహించాలన్న కల నిజమయ్యే అవకాశాలున్నాయి.
ఇమేజ్ అంటే ఇన్నోవేషన్ ఇన్ మల్టీమీడియా, గేమింగ్, యానిమేషన్, ఎంటర్టైన్మెంట్. ఇందుకోసం టీహబ్, టీవర్క్స్ పక్కన ఇమేజ్ టవర్ను కడుతున్నాం. అయితే ఇమేజ్ టవర్ వేరు, ఇమేజ్ సిటీ వేరు. ఇమేజ్ సిటీ అంటే… ఈరోజు ఓటీటీ పరిశ్రమ చాలా బలంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. సినిమాలు ఒకవైపు, ఓటీటీలు మరో వైపు దూసుకుపోతున్నాయి. నగర శివారులో ఇమేజ్సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని కేటీఆర్ వివరించారు.
మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కన్వెన్షన్స్, ఎగ్జిబిషన్స్ కలిస్తే మైస్. హైదరాబాద్లో హెచ్ఐసీసీ ఉంది. జీఎంఆర్ వారు ఎయిర్పోర్టులో చాలా పెద్దగా ఇలాంటిదే నిర్మిస్తున్నారు. దీంట్లో ఒకేసారి 8వేల మంది కూర్చునేలా ఉంటుంది. విమానాశ్రయం పరంగా మంచి కనెక్టివిటీ ఉంది. ఈవెంట్లు హైదరాబాద్లో జరిగేందుకు అనుకూలంగా ఉండేలా కన్వెన్షన్ హాల్స్ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఢిల్లీ తర్వాత మైస్ క్యాపిటల్గా నగరం ఉంది. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఈవెంట్లు నిర్వహించే నగరంగా ప్రసిద్ధి చెందేలా మైస్ను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కేటీఆర్ వివరించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి తెలంగాణ నలుమూలలా వెళ్లేందుకు అత్యంత వేగవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ అవసరం. ప్రస్తుతం రైలు, బస్సులు, కార్లు కాకుండా పర్యావరణ హితమైన, వేగవంతమైన ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్టు సిస్టం (ఆర్ఆర్టీఎస్)ను రాష్ట్ర వ్యాప్తం గా 7 మార్గాల్లో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశాం. గంట వ్యవధిలోనే హైదరాబాద్ నుంచి తెలంగాణ నలుమూలలా ఆర్ఆర్టీఎస్ ద్వారా వెళ్లవచ్చు. ఈ రైలు గంటకు 140 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తుంది. దీని నిర్మాణం కేంద్ర రైల్వే శాఖ కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకునేందుకు అవకాశం ఉండటంతో భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో 7 ప్రధాన మార్గాల్లో 792 కి.మీ మేర నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించామని మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు.
ఇందులో మొదటిది… శామీర్పేట ఓఆర్ఆర్ నుంచి గజ్వేల్, కొమరవెల్లి,సిద్దిపేట, కరీంనగర్ (140 కి.మీ), రెండవది: ఘట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి మొదలై బీబీనగర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, వరంగల్ (113 కి.మీ) మూడవది: పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ నుంచి చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్పల్లి, నల్లగొండ (81) కి.మీ, మరో మార్గాన్ని నార్కెట్పల్లి నుంచి నకిరేకల్ మీదుగా సూర్యాపేట, కూసుమంచి, ఖమ్మం 111 కి.మీ . నాల్గవది :శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి షాద్నగర్, బాలానగర్, జడ్చర్ల, మహాబూబ్నగర్ 50 కి.మీ. ఐదవది : టీఎస్ఏ ఓఆర్ఆర్ నుంచి మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్ (60 కి.మీ), ఆరవది: ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి ఇస్నాపూర్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ (64 కి.మీ), ఏడవది: కండ్లకోయ ఓఆర్ఆర్ నుంచి మేడ్చల్-మనోహరాబాద్, మాసాయిపేట, చేగుంట, మెదక్ (70 కి.మీ), మరో మార్గాన్ని చేగుంట నుంచి రామాయంపేట, బికనూర్, కామారెడ్డి, ఇందల్వాయి, డిచ్పల్లి, నిజామాబాద్ వరకు (103 కి.మీ). మొత్తం 7 మార్గాల్లో కలిపి 792 కి.మీ మేర ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ మార్గాన్ని నిర్మించనున్నామని కేటీఆర్ వివరించారు.
ప్రస్తుతం ప్రభుత్వం నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరాను విజయవంతంగా అమలు చేస్తోంది. ఇదే తరహాలో నగరంలో 24 గంటల పాటు మంచినీటిని సైతం సరఫరా చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. నిరంతరం నల్లాల ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు మౌలిక వసతులను పెద్ద ఎత్తున కల్పిస్తాం.
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అందులో ప్రధానమైనవి శాంతిభద్రతలు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే శాంతిభద్రతల పరంగా ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని, పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించి అమలు చేస్తోంది. భవిష్యత్తులోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీని వినియోగించనున్నారు. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, పోలీసింగ్ విధానాలను అనుసరించనున్నారు. ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం, సేఫ్ పబ్లిక్ స్పేస్, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించనుంది.
పట్టణీకరణతో పెరిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తూ పలు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల స్థానంలో పూర్తిగా గ్రీన్ ట్రాన్స్పోర్టు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం. ఇందుకోసం పెద్ద ఎత్తున విద్యుత్ వాహనాలను వినియోగించడం. అలాగే ఇళ్లు, ఖాళీ ప్రదేశాల్లో సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయడం. పట్టణాల్లో పర్యావరణ హిత భవనాలను నిర్మించడం. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 977 అర్బన్ పార్కులను అభివృద్ధి చేసిందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఓఆర్ఆర్ చుట్టూ ఐటీ కారిడార్లో సైకిల్ ట్రాక్ను 24 కి.మీ మేర ఏర్పాటు చేయడంతో పాటు దానిపై 13 మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంది. ఇలాంటివి భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో చేపడతామన్నారు.
హైదరాబాద్ చుట్టూ పర్యాటకంగా చాలా ప్రదేశాలు ఉన్నాయి. మీరందరూ మళ్లీ నన్ను గెలిపిస్తే పర్యాటక శాఖ మంత్రిగా నియమించాలని సీఎంను కోరతాను. నా కల హైదరాబాద్ను వరల్డ్ హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దడం. యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ నగరానికి రావాలి. టెక్నాలజీని వాడి వర్చువల్ రియాలిజీ టూరిజం స్పాట్గా మార్చాలి. వీటితో పాటు ఆహార పదార్థాల పరంగా హైదరాబాద్కు దేశ, విదేశాల్లో ఎంతో గుర్తింపు ఉంది. ఇవే కాకుండా అడ్వెంచర్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం, మెడికల్ టూరిజంలను మరింతగా అభివృద్ధి చేయవచ్చు. ముఖ్యంగా నదులు, రిజర్వాయర్లు ఉన్న ప్రాంతాల్లో టూరిజాన్ని పెంచేందుకు విస్తృతమైన అవకాశాలున్నట్లు గుర్తించాం.
లివ్… వర్క్… లర్న్… ప్లే… అనే నినాదంతో పట్టణీకరణ జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. శాటిలైట్ టౌన్షిప్లు కేవలం 50 నుంచి 100 ఎకరాల్లో కాకుండా ఒకేసారి 500 నుంచి 1000 పైగా ఎకరాల్లో సమగ్ర మౌలిక వసతులతో నిర్మించాలి. నగరంలో పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ముందు చూపులేకుండా వ్యవహరిస్తే నగరంలో జనసాంద్రత పెరిగి తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ ఇబ్బందులకు తోడు మౌలిక వసతుల కల్పన అసాధ్యంగా మారుతుంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేస్తామన్నారు. దీని ద్వారా నగరంలో నాణ్యమైన జీవనశైలి మెరుగుపడుతుంది. పచ్చదనానికి ప్రాధాన్యతనిచ్చి పెద్ద మొత్తంలో మొక్కలను నాటుతామన్నారు. ఒకేచోట అభివృద్ధి అంతా కేంద్రీకృతం కాకుండా ప్రాంతాల వారీగా అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారాన్ని ఈ శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం ద్వారా చూపుతాం. ఇందుకోసం బిల్డర్ల సహకారం చాలా అవసరమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2047 నాటికి నగరాన్ని సాంకేతిక రంగంలో ప్రపంచ అగ్రగామిగా చేయడం. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్గా మార్చడం. సుస్థిరత, మౌలిక సదుపాయాలు కల్పించడం. ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎక్సలెన్స్ను తీర్చిదిద్దుతామన్నారు.