Sabitha Indra Reddy | బడంగ్పేట, మే 4: ఈ నెల 6న మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ గాంధీనగర్ చౌరస్తాలో సాయంత్రం 7.30 గంటలకు మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో కార్యక్రమం ఉన్నట్లు ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గాంధీనగర్ చౌరస్తాను ఆమె పరిశీలించారు. వాహనాల పార్కింగ్ స్థలం, ప్రజలకు ఎటువైపు అనువుగా ఉంటుందని ఆమె స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లతో చర్చించారు.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 32 డివిజన్లు, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46 డివిజన్ల నుంచి, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 25 డివిజన్ల నుంచి, తుక్కుగూడలో ఉన్న 15 డివిజన్ల నుంచి, ఆర్కేపురం, సరూర్ నగర్ డివిజన్లతో పాటు, మహేశ్వరం, కందుకూరు మండలాల పరిధిలో ఉన్న ప్రతి గ్రామం నుంచి కేటీఆర్ రోడ్ షో కార్యక్రమానికి తరలి వచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
రోడ్ షో కార్యక్రమానికి భారీ స్థాయిలో జనం రానున్నట్లు ఆమె తెలిపారు. నియోజక వర్గంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విధానాలు నచ్చక గులాబీ గూటికి రాబోతున్నారన్నారు. చేవెళ్ల పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోబోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏ ఒక్కటి అమలు చేయక పోవడంతో ప్రజలు విసిగి పోయారన్నారు. వేసవి కాలంలో కనీసం నీటి సమస్యను కూడా పరిష్కరించడం లేదన్నారు.
బీజేపీ నల్లధనం తీసుకొస్తామని, ప్రతి ఒక్కరి అకౌంటులలో రూ.15లక్షలు వేస్తామని ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేశారన్నారు. అలాంటి పార్టీల మోసపూరిత విధానాలతో ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నుంచి వరుసగా మూడోసారి గెలువ బోతున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు ఇద్దరు బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీలు మారడంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చేవెళ్ల పార్లమెంటులో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని ఆమె దీమా వ్యక్తం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు.