హనుమకొండ, ఏప్రిల్ 16 : తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తోడ్పాటునందిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురసరించుకొని హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్, ట్రోఫీలను గురువారం హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి కలిసి ప్రదానం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. దాస్యం వినయన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ క్రికెట్ కప్ స్ఫూర్తితో వచ్చే సంవత్సరం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ గులాబీ శ్రేణులు, కాకతీయ క్రికెట్ అకాడమీ సభ్యులను ఆయన అభినందించారు. దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. ఓరుగల్లు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురసరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎనిమిదేండ్లుగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల్లో టోర్నీ విన్నర్గా 51వ డివిజన్, రన్నర్స్గా నిలిచిన 49వ డివిజన్ జట్లకు కేటీఆర్.. నగదు, ట్రోఫీ ప్రదానం చేశారు. డిపార్ట్మెంట్ క్రికెట్లో విన్నర్గా నిలిచిన అంజలి కిడ్నీ కేర్ సెంటర్ హాస్పిటల్ టీం, రన్నరప్గా నిలిచిన సంకీర్తన హాస్పిటల్ టీంలకు కూడా ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ కాకతీయ క్రికెట్ అకాడమీ (కేసీఏ)ఫౌండర్ చైర్మన్ ఫారుక్ అలీ, కేసీఏ మెంబర్స్ మాజీద్, వీరు, సిరాజ్, రాజేశ్, రాంబాబు, అదేవిధంగా 51వ డివిజన్ కార్పొరేట్ బోయినపల్లి రంజిత్ రావు, ప్రెసిడెంట్ ఫిరోజ్, 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.