“తొమ్మిదన్నరేండ్లలో కులం కొట్లాట లేదు.. మతం పంచాయితీ లేదు.. ఒక్క రోజూ కర్ఫ్యూ లేదు.. మతసామరస్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహానగరం ప్రశాంతంగా ఉంది. మన నగరాన్ని.. మన నాయకుడిని కాపాడుకుందాం..” అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం నగరంలోని నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలలో పాల్గొని ప్రసంగించారు. పాతబస్తీ, ఎయిర్పోర్టులకు మెట్రో విస్తరిస్తున్నామన్నారు. కరెంట్, తాగునీటికి ఢోకా లేదని, గచ్చిబౌలి తరహాలో గోషామహల్నూ అభివృద్ధి చేస్తామన్నారు. కోహ్లీ సెంచరీలాగా బీఆర్ఎస్ పార్టీ సెంచరీ సాధించాలన్నారు. నాంపల్లి, గోషామహల్లో గులాబీ జెండా ఎగురాలని పిలుపునిచ్చారు. పజ్జన్న గెలుపుతో సికింద్రాబాద్ దశ మారిందని.. పద్మారావు లాంటి నాయకుడు ఉండటం ప్రజల అదృష్టమన్నారు. ప్రజల్లో ఉండే నాయకుడిని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు.
– సిటీబ్యూరో, నవంబరు 18 (నమస్తే తెలంగాణ)
గోదావరి నీటితో మూసీనదిని ప్రక్షాళన చేపట్టి.. జీవనదిగా మార్చి, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో భోలక్పూర్లో నీరు కలుషితమై అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం స్వచ్ఛమైన నీటిని సమృద్ధిగా అందిస్తున్నదని చెప్పారు. శనివారం నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు నందకిశోర్వ్యాస్, సీహెచ్ ఆనంద్గౌడ్, పద్మారావుగౌడ్కు మద్దతుగా ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పాలనలో నగరం శాంతియుతంగా ఉన్నదని, ఎక్కడి నుంచి వచ్చినా.. తెలంగాణ బిడ్డలుగానే చూసుకుంటున్నామని తెలిపారు. కోహ్లీ సెంచరీ కొట్టినట్లు బీఆర్ఎస్ సెంచరీ కొట్టాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.