కల్యాణోత్సవం.. ఆలస్యం
స్వామివారి కల్యాణోత్సవం నిర్దేశించిన సమయానికి కాలేదు. మంత్రుల రాక ఆలస్యం కావడంతో గంట ఆలస్యంగా ఆలయవర్గాలు కల్యాణ తంతును ప్రారంభించాయి. ఉదయం 10.45 గంటలకు జరగాల్సిన పెండ్లి ఆలస్యం కావడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కల్యాణ వేదిక వద్దకు మొదటగా స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని 10.45గంటలకు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను 11.28 గంటలకు తీసుకొచ్చారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలను 11.38గంటలకు తీసుకొచ్చిన అనంతరం కల్యాణం జరిగింది. మాంగళ్యధారణ 12.28 గంటలకు
అర్చకులు పూర్తి చేశారు.
సిద్దిపేట ప్రతినిధి/ చేర్యాల, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. మల్లన్న స్వామి…మమ్మేలు అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆదివారం సిద్దిపేట జిల్లా మల్లన్న క్షేత్రంలోని తోట బావి కల్యాణ వేదిక వద్ద లగ్గం జరిగింది. కల్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణోత్సవంలో స్వామి వారి తరపున పడిగన్నగారి మల్లికార్జున్ దంపతులు, అమ్మవార్ల తరఫున మహాదేవుని మనోహర్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారి తరఫున మహాదేవుని సాంబయ్య, స్వామి వారి తరఫున పడిగన్నగారి మల్లయ్య దంపతులు పాల్గొని కల్యాణ తంతు నిర్వహించారు.
పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ
కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, చామకూర మల్లారెడ్డి. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డితో కలిసి సమర్పించారు. ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు, ఈవో ఎ.బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య,అర్చకుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అంతకు ముందు కొమురవెల్లి గ్రామ సంప్రదాయం మేరకు సర్పంచ్ సార్ల లతాకిష్టయ్య దంపతులు, ఒగ్గు పూజారులు పట్టు వస్ర్తాలు, పుస్తె మట్టెలను సమర్పించారు.జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీవో రమేశ్, ఎంపీపీలు తలారీ కీర్తనాకిషన్, బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీలు సిలువేరు సిద్ధప్ప, గిరి కొండల్రెడ్డి పాల్గొన్నారు.
కల్యాణం
స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం ఏకాదశి ఉదయం 10.45 గంటలకు నిర్వహించాల్సిన కల్యాణం ఆలస్యంగా జరిగింది. కొమురవెల్లి పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వద్ద స్వామి వారి కల్యాణం నిర్వహించారు. అంతకు ముందు ఊరేగింపుగా వెళ్లి స్వామివారి తరఫున మహాదేవుని వంశస్తులు, పడిగన్నగారి వంశస్తులు కూర్చుని కల్యాణోత్సవం నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి తాళి, మట్టెలు, ఓడి బియ్యం, బట్టలు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12గంటలకు రుద్రాభిషేకం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు.