బంజారాహిల్స్, ఫిబ్రవరి 8 : విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను తీసుకురావడంతో పాటు వాటిని నూతన అవిష్కరణలుగా మార్చేందుకు రాష్ట్రంలోని ప్రతి ఇంజినీరింగ్ కళాశాలలో నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నం.3లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన నాలెడ్జ్ సెంటర్ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్స్, ఇన్నోవేటివ్ ఆలోచనలకు మంచి డిమాండ్ ఉన్నదని తెలిపారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం టీ హబ్తోపాటు అనేక కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. కళాశాల దశ నుంచే నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ప్రతి విద్యాసంస్థలో నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని సూచించారు. కొత్త ఆవిష్కరణపై దృష్టి పెట్టకపోతే 20 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ మహ్మద్ వలీవుల్లా, గౌరవ కార్యదర్శి జాఫర్ జావెద్, తదితరులు పాల్గొన్నారు.