సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పర్యాటక రంగానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నది. చారిత్రక, వారసత్వ, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అనేక పర్యాటక ప్రదేశాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున విదేశీ, స్వదేశీ పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు, పర్యాటకులకు దోహదపడేలా లండన్ తరహాలో సమాచార కియోస్క్లు (వీధి మ్యాపులు) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు లండన్లో ముఖ్యమైన ప్రాంతాల్లో సమాచారం తెలుపుతూ కియోస్క్లు ఉన్నాయని, హైదరాబాద్లోనూ ఇవి అవసరమంటూ అనుజ్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ఆదేశించారు. కాగా, ముఖ్యమైన ఫుడ్కోర్టులు, షాపింగ్ కాంప్లెక్స్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్టు ప్రాంతాల వద్ద ఈ సమాచార కియోస్క్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ వీధి మ్యాపుల ద్వారా ఆయా ప్రాంతాల్లో ముఖ్యమైనవి ఎక్కడ ఏం ఉన్నాయో తెలుసుకునే వీలు ఉంటుంది. ఇది ప్రజలకు ఎంతగానో దోహదపడనున్నది.