మాదాపూర్, డిసెంబర్ 10: మాదాపూర్లోని కిమ్స్ దవాఖానలో ఏడేళ్ల బాలికకు అరుదైన శస్త్ర చికిత్స చేసి క్యాన్సర్ కణతిని తొలగించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన నాళానికి అత్యంత సమీపంలో క్యాన్సర్ కణతి ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. బాలికది మధ్య తరగతి కుటుంబం. బాలిక తండ్రి మిఠాయిల దుకాణం నడుపుతుంటాడు. బాలిక పద్మిని చదువులో, ఆటలో చురుకుగా ఉండేది. కొన్ని నెలలుగా మెడపై విపరీతమైన నొప్పి రావడంతో చదువుపై శ్రద్ధ చూపలేకపోతుంది. కుటుంబ సభ్యులు పలు చోట్ల పరీక్షలు చేయించగా మెడకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన నాళానికి అత్యంత సమీపంలో మెడ వద్ద క్యాన్సర్ కణతి ఏర్పడినట్లుగా తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు బాలికను పలు దవాఖానాలకు తీసుకువెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు కొండాపూర్లోని కిమ్స్ దవాఖాన కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ కృష్ణ చైతన్యను కలిసి విషయాన్ని వివరించారు. దీంతో డాక్టర్ కృష్ణ చైతన్య ముందుగా క్యాన్సర్ కణతిని మెదడుకు వెళ్ళే రక్తనాళాల నుంచి వేరు చేసి చికిత్స అందించారు. అనంతరం, ఒకసారి చికిత్స చేసిన చోటును సిటీ స్కాన్ చేసి రిపోర్టును పరిశీలించగా ప్రమాదం ఏమి లేదని నిర్ధారించుకొని క్యాన్సర్ కణితిని తొలగించారు. దీంతో బాలికకు ప్రమాదం తప్పిదనట్లు వైద్యులు తెలిపారు.