బంజారాహిల్స్, డిసెంబర్ 16: అధిక వడ్డీలు ఇస్తానంటూ మహిళలకు బురిడీ.. వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలంటూ అనేకమందిని మోసం చేసిన కిలాడీ లేడీతో పాటు ఆమెకు సహకరించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… అమరావతి ప్రాంతానికి చెందిన కొడాలి శ్రీలక్ష్మి వెంకటేశ్వరనగర్ బస్తీలో అద్దె ఇంట్లో ఉంటోంది. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో కాల్సెంటర్లో పనిచేసే ఆమె అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు బస్తీలోని మహిళలతో సన్నిహితంగా ఉంటుంది.
తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని పద్మ కుమార్తెకు మెడికల్ సీటు వచ్చిందని రూ.2కోట్ల దాకా ఖర్చవుతుందని నమ్మించి అధిక వడ్డీ ఇప్పిస్తానంటూ పలువురు మహిళల వద్దనుంచి రూ.2 నుంచి 10 లక్షల దాకా వసూలు చేసింది. తన కొడుకు ఇంజినీరింగ్ ఫీజు కోసమని, తన భర్త పెట్టబోయే ఫ్యాక్టరీలో పెట్టుబడి పెడితే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయంటూ నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసింది.
ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద డబ్బులు వసూలు చేసిన కొడాలి శ్రీలక్ష్మి, ఆమె భర్త సత్యప్రసాద్ వ్యవహారం ఇటీవల బయటకు రావడంతో బాధితులు ఆమెను నిలదీశారు. జనవరిలో డబ్బు లు మొత్తం తిరిగి ఇస్తానంటూ కొంతమందికి చెక్కులు రాసి ఇచ్చి 15రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఉడాయించింది. చెక్కులను కొంతమంది బ్యాంకులో వేయగా బౌన్స్ అయ్యాయి. మోసపోయినట్లు గుర్తించిన సుమారు 20 మంది బాధితులు సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బస్తీలో సుమారు రూ.3 కోట్లకు పైగా వసూలు చేసిందని బాధితులు ఆరోపించారు.