బంజారాహిల్స్,జనవరి 5: ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన పెండింగ్ అభివృద్ధి పనులన్నీ త్వరగా ప్రారంభమయ్యేలా అధికారులతో సమీక్షా సమావేశాన్ని రెండు మూడు రోజుల్లో నిర్వహిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహిల్స్ డివిజన్ గాయత్రీహిల్స్కు చెందిన పలువురు కాలనీవాసులు, బీఆర్ఎస్ నేతలు శుక్రవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ను కలిసి సమస్యలు వివరించారు. కాలనీలో రెండు సీసీ రోడ్ల నిర్మాణం మధ్యలో నిలిచిపోయిందని, బడ్జెట్ లేకపోవడంతో కాంట్రాక్టర్లు రావడం లేదని వారు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించామని,ఎన్నికల కోడ్ కారణంగా అవన్నీ నిలిచిపోయాయన్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాయత్రీనగర్ కాలనీవాసులు వెంకటేశ్ యాదవ్, శివ కొమ్మినేని,భరత్, సాంబమూర్తి, సురేష్, రాజు, వాణి తదితరులు పాల్గొన్నారు.