బంజారాహిల్స్,మార్చి 19: ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో జీవో నంబర్ 58, 59 కింద మరోసారి ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక బస్తీలు ప్రభుత్వ స్థలాల్లో ఏర్పడినవేనని, సుమారు 40 ఏళ్ల క్రితమే ఏర్పడిన ఆయా బస్తీల్లో ఇండ్లు కట్టుకున్నవారికి జీవో 58, 59 కింద బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిందన్నారు. అయితే 2014 తర్వాత నోటరీ ద్వారా ఇండ్లు కొనుగోలు చేసుకున్నవారితో పాటు గతంలో వివిధ కారణాలతో దరఖాస్తులు చేసుకున్న వారికి గతంలో క్రమబద్ధీకరణకు అవకాశం లభించలేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కటాఫ్ డేట్ను 2020దాకా పెంచాలని తాను పలుమార్లు సీఎం కేసీఆర్ను కోరానని, తమ కోరికను మన్నించి జీవో 58, 59 కింద మరోనెలరోజుల పాటు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. ఏప్రిల్ 1నుంచి 30దాకా క్రమబద్ధ్దీకరణ దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.
నియోజకవర్గం పరిధిలోని ఖైరతాబాద్ డివిజన్ రాజ్నగర్, మారుతీనగర్, బీజేఆర్నగర్. రామకృష్ణనగర్,బాలాపుర బస్తీ, ఫిలింనగర్ 18 బస్తీలు, పద్మాలయ అంబేద్కర్నగర్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 46 అంబేద్కర్నగర్, గురుబ్రహ్మనగర్, దుర్గాభవానీనగర్, జవహర్నగర్, గాయత్రీ హిల్స్, ఇందిరానగర్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని దేవరకొండబస్తీ, నందినగర్, వెంకటేశ్వరనగర్, సింగాడబస్తీ. గౌరీశంకర్ కాలనీ, బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఎన్బీటీనగర్, కాజానగర్, బోళానగర్, ఎన్బీనగర్తో పాటు సోమాజిగూడ డివిజన్కు చెందిన ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లోని ఇండ్లు కట్టుకున్నవారందరూ కచ్చితంగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దళారుల మాటలు నమ్మవద్దన్నారు. క్రమబద్ధ్దీకరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు బస్తీలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. 125 గజాల స్థలం దాకా ఉచితంగా క్రమబద్ధ్దీకరణ చేస్తారని, ఎవరైనా డబ్బులు అడిగితే తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరలోనే గృహలక్ష్మి పథకం కింద రేకుల ఇండ్లు, గుడిసెలు ఉన్న పేదలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని, దళితబంధు పథకం రెండోవిడతలో భాగంగా 1100 మందికి సాయం అందిస్తామని పేర్కొన్నారు.
బంజారాహిల్స్,మార్చి 19: బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశాలతో ఆదివారం జూబ్లీహిల్స్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నేత మామిడి నర్సింగరావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గురుబ్రహ్మనగర్ బస్తీలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. ఏప్రిల్ 1నుంచి జీవో 58 కింద పేదలకు ఉచితంగా ఇండ్లను క్రమబద్ధ్దీకరణ చేస్తారని, గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షల చొప్పున సాయం అందిస్తారని తెలిపారు. ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి పథకం అందుకున్న లబ్ధ్దిదారులతో మాట్లాడారు. అర్హులైన వారికి త్వరలోనే కొత్త పింఛన్లు వస్తాయని మామిడి నర్సింగరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ నేతలు నగేష్, గోపాల్నాయక్, రాంచందర్, మాణిక్యం,ఈశ్వరయ్య, రవి, కిరణ్, దయ్యాలదాసు తదితరులు పాల్గొన్నారు.