బంజారాహిల్స్,ఆగస్టు 10: ఒకవైపు పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూనే నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని బీజేఆర్నగర్లో గురువారం పర్యటించిన ఎమ్మెల్యే స్థానికుల అవసరాల కోసం బోర్వెల్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ..గత నాలుగున్నర ఏళ్లలో నియోజకవర్గంలో కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులను పూర్తిచేశామన్నారు. జూబ్లీహిల్స్ డివిజన్లోని అనేక బస్తీల్లో కొత్త సీవరేజ్లైన్లు,మంచినీటి పైపులైన్ పనులను పూర్తిచేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తిచేశామన్నారు. బీజేఆర్నగర్లో స్థానికుల కోరిక మేరకు త్వరలోనే మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణంతో పాటు ఆస్పత్రి నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, దామోదర్. నడిమింటి కృష్ణ. రాములమ్మ, ప్రభాకర్, నర్సింహ, గోపాల్నాయక్, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లో నవోదయ కాలనీలో రూ.12.5లక్షల వ్యయంతో చేపట్టిన 300 ఎంఎం డయా సీవరేజ్ లైన్ పనులను, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లో మాజీ మంత్రి విజయరామారావు నివాసం లేన్లో రూ.7.8లక్షల వ్యయంతో 200 ఎంఎం డయా సీవరేజ్లైన్ పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు చౌహాన్, నల్ల శివమాదిగ, ఎస్ఎమ్.జావెద్, బంజారాహిల్స్ డివిజన్ జలమండలి మేనేజర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.